రాజభవన్ ఎదుట కండక్టర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఓ వ్యక్తి శుక్రవారం హైదరాబాదులోని రాజభవన్ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతన్ని కర్నూలు జిల్లాలో ఆర్టీసి కండక్టర్గా పనిచేస్తూ సస్పెండ్ అయిన రాజేంద్ర కుమార్ (52)గా గుర్తించారు. పురుగుల మందు తాగి అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
వెంటనే స్పందించిన పోలీసులు అతన్ని చికిత్స నిమిత్తం తొలుత యశోదా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. నగరంలో పేకాట క్లబ్లను మూసేయాలని డిమాండ్ చేస్తూ అతను ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రాజేంద్ర కుమార్ హైదరాబాదులోని నాచారంలో నివాసం ఉంటున్నాడు.

ఈతకు వెళ్లిన విద్యార్థులు మృతి
ఈతకు వెళ్లిన విద్యార్థులు ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయారు. వారిలో ముగ్గురు మరణించగా, ఒకతను ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా హన్మకొండ మండలం గోపాలపురం గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.
గోపాలపురంలోని జవహర్ నగర్ కాలనీకి చెందిన రామకృష్ణ అలియాస్ అఖిల్ (14), బూరం సన్నీ (15), జిడ్డె మాధవ్ (13), రవితేజ (13) కలిసి గోపాలపురం చెరువులో ఈతకు వెళ్లారు. అయితే ఈత రాకపోవడంతో నలుగురు కూడా నీటిలో మునిగిపోయారు. వీరిలో రవితేజ ప్రాణాలతో బయటపడ్డాడు.
విద్యార్థులు నీటిలో మునిగిపోవడం గమనించిన రంజన్ అనే వ్యక్తి రవితేజ ప్రాణాలు కాపాడాడు. మిగిలిన ముగ్గురు అప్పటికే పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రక్షించడం సాధ్యం కాలేదు.












Click it and Unblock the Notifications