దారుణం: భార్య, కూతురు, తల్లిని చంపిన ఉన్మాది
అనంతపురం: జిల్లాలోని కంబదూరు మండల పరిధిలోని నూతిమడుగులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ఉన్మాది దాడిలో భార్య, కూతురు, తల్లి హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నూతిమడుగు గ్రామానికి చెందిన గొల్ల సోమశేఖర్ గత వారం రోజుల నుంచి మతిస్థిమితం కోల్పోయాడు.
ఈ క్రమంలోనే అతడు గత మూడు రోజుల నుంచి కుటుంబ సభ్యులను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడంతో పాటు హత మారుస్తానని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం రాత్రి ఓ వైపు వర్షం కురుస్తుండడం, మరోవైపు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఎవరూ బయటికి రాలేదు.
అయితే రాత్రి 9 గంటల సమయంలో గ్రామం నడిబొడ్డున మంటలు వస్తుంటే స్థానికులు భయపడి, కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు పరుగులు తీశారు. అప్పటికే ఘోరం జరిగిపోయింది. ఉన్మాది సోమశేఖర్ గొడ్డలితో తల్లి నర్సమ్మ, భార్య రామాంజినమ్మ, వికలాంగురాలైన కుమార్తె మేఘనలను దారుణంగా నరికి హతమార్చాడు.
అనంతరం ఇంటికి నిప్పు పెట్టి, తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో డీఎస్పీ అనిల్, సిఐ మన్సూరుద్దీన్, కంబదూరు ఎస్ఐ, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీశారు. అలాగే సోమశేఖర్ను 108 వాహనం ద్వారా కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు.