భార్య ప్రియుడిగా భావించి కొడుకును గొడ్డలితో నరికిన తండ్రి
కర్నూలు: కర్నూలు జిల్లాలో దారుణ సంఘటన జరిగింది. తన భార్య ప్రియుడిగా భావించి ఓ వ్యక్తి తన 14 ఏళ్ల కుమారుడిపై గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటన కర్నూలు జిల్లా బేతంచర్ల మండలం గూటుపల్లెలో శుక్రవారం చోటు చేసుకుంది.
బాధితుడిని పరుశరాంగా గుర్తించారు. గత కొన్ని రోజులుగా తండ్రికీ కుమారుడికీ మధ్య గొడవలు జరుగుతున్నాయని, శుక్రవారం ఉదయం సోమన్న పరుశరాంపై గొడ్డలితో దాడి చేశాడని, తనను రక్షించుకునే క్రమంలో పరుశరాం గాయపడ్డాడని పోలీసులు చెప్పారు.
చేతులకు, భుజానికి గాయలైనట్లు పోలీలు తెలిపారు. బాధితుడి తల్లికి వివాహేతర సంబంధం ఉందని ఆరోపణలు వచ్చాయి. పడకపై పరుశరాం పడుకుని ఉండగా, అతన్ని తన భార్య ప్రియుడిగా భావించి సోమన్న దాడి చేశాడని పోలీసులు చెప్పారు.
తాను తన కొడుకునే నరికినట్లు గుర్తించి సోమన్న విలపించడం ప్రారంభించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.