భర్త పశుత్వం: గర్భిణీని కాలితో తన్నాడు, అమ్మ పొట్టలోనే శిశువు మృతి
అమరావతి: కట్టుకున్న భార్య పట్ల ఓ భార్త అమానుషంగా ప్రవర్తించాడు. భర్త పశుత్వానికి బలైన మృత శిశువుని చూసి ఆ తల్లి విలవిలవాడుతోంది. పండంటి బిడ్డకు జన్మనివ్వాల్సిన ఆ కన్నతల్లి తల్లడిల్లిపోతోంది. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం వచ్చిన నాగలక్ష్మీ అనే మహిళ కష్టాన్ని చూసిన ప్రతి ఒక్కరూ చలించిపోతున్నారు.
బాధితురాలు, పోలీసుల కథనం ప్రకారం ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఇడుపులపాడుకు చెందిన నాగలక్ష్మికి, బల్లికురువ మండలం కొణిదెవకు చెందిన పల్లపు గోపితో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. గోపి తనకు నచ్చినప్పుడు ఆటో నడుపుతుంటాడు లేదంటే ఊళ్లో అల్లరిచిల్లరిగా తిరుగుతూ ఉంటాడు.
దీంతో ఊళ్లో జల్సాలకు అలవాటు పడిన గోపి, నాగలక్ష్మీని అదనపు కట్న తీసుకురావాలని నిత్యం వేధింపులకు గురి చేసేవాడు. తల్లిదండ్రులు కూడా మద్దతు పలకడంతో గోపీ భార్యను చిత్రహింసలకు గురి చేశాడు. పెళ్లి సందర్భంగా నాగలక్ష్మీకి ఆమె తల్లిదండ్రులు చేయించిన బంగారాన్ని ఇప్పటికే అమ్ముకున్నాడు.
వీరికి అక్షయ చరిత అనే రెండేళ్ల పాప ఉంది. ప్రస్తుంత నాగలక్ష్మీ ఎనిమిది నెలల గర్భిణి. పదో తరగతి వరకు చదువుకున్న నాగలక్ష్మి.. ఊళ్లో అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా పని చేస్తోంది. అంతేకాదు చదువు అంటే నాగలక్ష్మీకి ఎంతో ఇష్టం. కరస్పాండెంట్ కోర్సులో బీఏ ఫైనలియర్ పరీక్షలను మంగళవారం రాసి ఇంటికి వచ్చింది.
ఈ క్రమంలో అదే రోజు రాత్రి నాగలక్ష్మీతో గోపీ గొడవపడ్డాడు. అంగన్ వాడీలో పనిచేస్తూ తాను సంపాదిస్తున్న డబ్బులను ఇవ్వాలని ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చాడు. డబ్బులు లేవని చెప్పడంతో ఆమెతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. నిద్రిస్తున్న తన రెండేళ్ల కుమార్తెను గోడకేసి కొట్టాడు.
అడ్డుకోబోయిన నాగలక్ష్మిని కిందకు తోసి కాలుతో తన్నడం ప్రారంభించాడు. మద్యం మత్తులో ఉన్న గోపీ తన భార్యను ఎక్కడ తన్నుతున్నాడో కూడా గుర్తించకుండా ఆమెను పదేపదే పొత్తికడుపుపై తన్నాడు. దీంతో గోపీ తన్నులను తట్టుకోలేక నాగలక్ష్మీ గట్టిగా కేకలు పెట్టింది.
దీంతో వెంటనే స్థానికులు గోపిని అదుపు చేశారు. అప్పటికే, గర్భిణీగా ఉన్న నాగలక్ష్మీకి తీవ్ర రక్తస్రావం అయింది. స్థానికులు నాగలక్ష్మీని త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లమని గోపికి సూచించారు. అయితే మనిషి రూపంలో ఉన్న పశువు కావడంతో ''అది చస్తే మరో భార్య వస్తుంది నాకు'' అంటూ వెళ్లిపోయాడు.
దీంతో స్థానికులే స్పందించి నాగలక్ష్మీని ఆసుపత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఆపరేషన్ చేసి శిశువుని బయటకు తీశారు. నెలలు నిండకుండానే శిశువుని బయటకు తీయడంతో ఒకరోజు ఐసీయూలో ఉంచారు. శిశువు మరణించగా తల్లిని మాత్రం కాపాడగలిగారు. నాగలక్ష్మీ ఈ దుస్థితికి కారణమైన భర్త గోపీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.