ఇద్దరు భార్యలు: నగలు అడిగితే ఒకర్ని చంపేశాడు
అనంతపురం: బంగారు నగలు చేయించాలని అడిగినందుకు ఓ భర్త భార్యను చంపేశాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. డి. హీరేహాళ్ మండలం లింగంపల్లి గ్రామంలో ఆ కిరాతక భర్త ఆ ఘాతుకానికి ఒడిగట్టాడు.
మల్లెన్నకు ఇద్దరు భార్యలు, మల్లెన్న వేధింపులు తట్టుకోలేక మొదటి భార్య ఎనిమిదేళ్ల క్రితం విడాకులు ఇచ్చింది. ఆ తర్వాత మల్లెన్న కర్ణాటకలోని కన్నేకుప్పకు చెందిన నాగవేణిని పెళ్లి చేసుకున్నాడు. మల్లెన్న తనకున్న 30 ఎకరాల పొలంలో ఈ మధ్య పత్తి పంట వేశాడు.
పంటలో దిగుబడి బాగా రావడంతో నాగవేణి బంగారు నగలు చేయించాలని భర్తను అడిగింది. అందుకు మల్లెన్న అంగీకరించలేదు. దాంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఆ గొడవలో మల్లెన్న ఆగ్రహంతో నాగవేణి నెత్తి మీద బలంగా కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.
అయితే, తీవ్ర ఆందోళనకు గురైన మల్లెన్న భార్య మృతదేహంపై కిరోసిన్ పోసి నిప్పంటించి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో అతను నిజాలు కక్కాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు మల్లెన్నను అరెస్టు చేశారు.