జైలుశిక్షపై హైకోర్టుకు తోట త్రిమూర్తులు ! అత్యవసర విచారణ ! తూర్పున కీలకం..
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ అంబేద్కర్ జిల్లాలోని వెంకటాయపాలెంలో దళితుల శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక ప్రత్యేక కోర్టు విధించిన 18 నెలల జైలుశిక్షపై వైసీపీ మండపేట అభ్యర్ధి తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. విశాఖ కోర్టు తీర్పుపై అత్యవసర విచారణ జరపాలని కోరారు. త్రిమూర్తులుతో పాటు ఈ కేసులో జైలుశిక్ష పడిన మరో 8 మంది కూడా హైకోర్టులో ఈ మేరకు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ హైకోర్టు విచారణ జరపబోతోంది.
28 ఏళ్ల క్రితం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు తనకు వ్యతిరేకంగా పనిచేశారన్న కారణంతో ఐదుగురు దళితులను బంధించి, హింసించి, వారిలో ఇద్దరికి శిరోముండనం చేసినట్లు తోట త్రిమూర్తులుతో పాటు మరో 8 మందిపై ఆరోపణలు వచ్చాయి. వీటిపై సుదీర్ఘకాలం సాగిన విచారణ తర్వాత ఆరోపణలు రుజువు కావడంతో తాజాగా విశాఖ కోర్టు తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలుశిక్షతో పాటు 2 లక్షల జరిమానా కూడా విధించింది.

ప్రస్తుతం మండపేట వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు తీర్పు షాక్ గా మారింది. ఈ తీర్పు ఆధారంగా తోట త్రిమూర్తులు జైలుకు వెళ్లాల్సిన పరిస్దితి. దీంతో ఆయన అత్యవసర విచారణ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు ఇచ్చే తీర్పు గోదావరి జిల్లాల్లో భారీ సంఖ్యలో ఉన్న ఎస్సీలకు కీలకంగా మారింది. దీంతో ఈ కేసులో హైకోర్టు ఇచ్చే తీర్పుపై వైసీపీ నేతలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications