జనసేన మీటింగ్ లో వైసీపీ నేత
మంగళగిరిలో బలంగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కాండ్రు కమల.. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
ఏపీలో అధికార పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరేందుకు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె వైసీపీలో ఉన్నారు. జనసేన ఆధ్వర్యంలో జరిగిన బీసీ సదస్సులో ఆమె పాల్గొన్నారు. అకస్మాత్తుగా జనసేన సమావేశంలో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. పార్టీలన్నీ బీసీల ఓట్లు కావాలంటున్నాయని, కానీ ఎమ్మెల్యే సీట్ల దగ్గరకు వచ్చేసరికి వెన్ను చూపిస్తున్నాయన్నారు. బీసీలు బలంగా ఉన్న మంగళగిరి వంటి నియోజకవర్గంలో కూడా ఓసీలే పోటీచేస్తున్నారని విమర్శించారు. నిధులు, విధులు లేని స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు పదవులిచ్చి తమకేదో రాజ్యాధికారం ఇచ్చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని కమల సమవేశంలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంగళగిరిలో బలంగా ఉన్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కాండ్రు కమల.. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. గతంలో మంగళగిరి మున్సిపల్ ఛైర్ పర్సన్ గా, ఎమ్మెల్యేగా పని చేశారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం మంగళగిరి సీటును నారా లోకేష్కు కేటాయించడంతో.. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. కానీ, ఇప్పుడు జనసేన బీసీ సదస్సుకు హాజరవడం, బీసీలకు జరుగుతున్న అన్యాయంపై గొంతు ఎత్తడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.

వైసీపీ నుంచి ప్రస్తుతం ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగిన నారా లోకేష్ పై ఆయన విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు గెలవడంతోపాటు నియోజకవర్గంలో ఆళ్లపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో నియోజకవర్గం మార్చాలనే యోచనలో జగన్ ఉన్నారు. సత్తెనపల్లి నుంచి పోటీచేయించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా తాను అక్కడినుంచే మరోసారి పోటీకి దిగుతున్నట్లు లోకేష్ ప్రకటించారు. ఈసారి విజయం సాధించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications