మరిన్ని చిక్కుల్లో జోగి రమేష్: తాజా నోటీసులు
Jogi Ramesh: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గృహ నిర్మాణ శాఖమాజీ మంత్రి జోగి రమేష్కు మరో భారీ షాక్ తగిలింది. పోలీసులు ఆయనకు నోటీసులను జారీ చేశారు. ఆయన కుమారుడు జోగి రాజీవ్ను అవినీతి నిరోధక విభాగం అధికారులు అరెస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి నివాసంపై దాడి చేసిన కేసును ఎదుర్కొంటోన్నారు జోగి రమేష్. ఈ కేసులో మంగళగిరి పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఈ సాయంత్రం మంగళగిరిలోని డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో జోగి రమేష్ కూడా అరెస్ట్ అవుతారనే ప్రచారం జరుగుతోంది. అంబాపురం అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రాజీవ్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆయనను అదుపులోకి తీసుకున్న అనంతరం మంగళగిరి సీఐడీ కార్యాలయానికి తరలించారు ఏసీబీ అధికారులు.
అంతకుముందు- జోగి రమేష్ ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. విస్తృతంగా తనిఖీలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ తెల్లవారు జామున 5 గంటల సమయంలో సుమారు 15 మంది ఏసీబీ అధికారులు, సిబ్బంది ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టారు.
అంబాపురంలో అగ్రిగోల్డ్ భూములను విక్రయించారనే కేసులో జోగి రాజీవ్ను అరెస్ట్ చేశారు. సీఐడీ అధికారుల ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా అక్కడి అగ్రిగోల్డ్ భూములను కబ్జా చేశారని, వాటిని విక్రయించడం ద్వారా ద్వారా అయిదు కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారనేది జోగి రమేష్ కుటుంబ సభ్యులపై ఆరోపణలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications