వివాహితపై కన్నేసిన ఇంటి యజమాని: అవమానంతో ఆత్మహత్య
ఒంగోలు: ఇంట్లో అద్దెకు ఉంటున్న ఓ వివాహిత మహిళపై ఇంటి యజమాని కన్నేశాడు. ఆమె భర్త ఇంట్లో లేనప్పుడు అదను చూసి ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. దీంతో కేకలు వేసి అక్కడి నుంచి ఆ మహిళ పరారైంది.
ఆ తర్వాత ఇరుగుపొరుగువారి మాటలు తట్టుకోలేక మానసిక వేదనకు గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులోని నల్లబండ బజారు కాలనీలో శుక్రవారం జరిగింది. స్థానికంగా నివాసం ఉంటున్న సుబ్బరత్నాలు, ఈశ్వరమ్మ (24) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

వారు మొద్దు రాంరెడ్డి (60) అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వడ్డీ వ్యాపారం చేస్తున్న రాంరెడ్డి ఈశ్వరమ్మపై కన్నేశాడు. గురువారంనాడు ఆమె భర్త ఇంట్లో లేకపోవడం గమనించి లోపలికి వెళ్లి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె నిరాకరించడంతో అత్యాచార యత్నం చేసాడు.
దాంతో కేకలు వేస్తూ ఆమె బయటకు పరుగు పెట్టింది. ఆ తర్వాత గురువారం రాత్రి ఇరు కుటుంబాల మధ్య తగాదా జరిగింది. ఈ క్రమంలో ఆమెను సూటిపోటి మాటలతో హింసించడంతో మనస్తాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.












Click it and Unblock the Notifications