జగన్ పాదయాత్రకు పల్నాడులో అనూహ్య స్పందన:చర్చనీయాంశం
గుంటూరు:వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రకు పల్నాడులో లభిస్తున్న అనూహ్య స్పందన గుంటూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నర్సరావు పేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్రకు వస్తున్న విశేష స్పందన వైసిపి శ్రేణుల్లో ఆనందోత్సాహాలు నింపుతుండగా...టిడిపి మద్దతుదారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
ప్రధానంగా ఆదివారం పల్నాడు ముఖద్వారం నర్సరావుపేటలో జగన్ పర్యటన జన సంద్రాన్నే తలపించదనడంలో అతిశయోక్తి లేదు. అలాగే ఇక్కడ జగన్ చేసిన ప్రసంగానికి ప్రజల నుంచి అడుగడుగునా హర్షధ్వానాలు లభించగా, ఆయనతో పాటు స్థానిక నేతల ప్రసంగాలకు కూడా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.

గుంటూరు జిల్లా యాత్ర...అనూహ్య స్పందన
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర ప్రస్తుతం గుంటూరు జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ జిల్లాకు ముందు జగన్ పాదయాత్రకు విశేష స్పందన లభించినా...రాయలసీమ జిల్లాలు కాబట్టి ఆ మాత్రం స్పందన కామనేనంటూ టిడిపి నేతలు కొట్టిపడేస్తూ వచ్చారు. అయితే గుంటూరు జిల్లాలో జగన్ పాదయాత్రకు లభిస్తున్న స్పందన మాత్రం టిడిపి శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారడమే కాదు...ఆందోళన కూడా కలిగిస్తోంది. కారణం అత్యంత రాజకీయ చైతన్యమున్న జిల్లాగా గుర్తింపు పొందిన గుంటూరు జిల్లాలో సహజంగా ఏ పార్టీకి అత్యధిక సీట్లు లభిస్తే అదే పార్టీ సాధారణంగా అధికారపీఠం అధిరోహిస్తూ ఉంటుంది.

2014 ఎన్నికల్లోనూ...అదే సంప్రదాయం...
2014 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని 17 అసెంబ్లీ స్థానాల్లో 12 టీడీపీ కైవసం చేసుకోగా ఐదు స్థానాలను వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. మూడు పార్లమెంట్ స్థానాల్లోనూ సైకిల్నే విజయం వరించింది. అయితే ప్రస్తుతం జగన్ పాదయాత్ర ప్రధానంగా పార్టీ ఓటమి పాలైన నియోజకవర్గాల గుండా కొనసాగుతుండగా అక్కడ జగన్ కు లభిస్తున్న విశేష ఆదరణ టిడిపి శ్రేణుల్లోనూ చర్చనీయాంశం అయింది. పైగా బహిరంగ సభలకే కాకుండా పాదయాత్రల్లో భాగంగా నిర్వహిస్తున్న సాధారణ సభలకు జనం భారీ సంఖ్యలో తరలివస్తుండటం గమనార్హం.

చర్చనీయాంశంగా...నర్సరావుపేట సభ
ఇక అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సొంత నియోజకవర్గమైన నర్సరావుపేటలో జగన్ సభకు తరలివచ్చిన జన శ్రేణులు స్థానిక టిడిపి నేతల్లో గుబులురేపి ఉంటాయనడంలో సందేహం లేదు. అలాగే జగన్ ఇక్కడ తన ప్రసంగం కూడా అలవాటైన పాత ధోరణిలో కాకుండా పంచ్ డైలాగులతో చెప్పడం, దానికి సభకు హాజరైన జనం జేజేలు పలకడం వైసిపి శ్రేణుల్లో చెప్పలేనంత నూతనోత్సాహాన్ని నింపినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా స్పీకర్ కోడెల కుటుంబాన్ని ఉదహరిస్తూ ఇక్కడ టిఎస్టీ, కెఎస్టీ పేరుతో ప్రత్యేక ట్యాక్స్ లు వసూలు చేస్తున్నారంటూ జగన్ చేసిన వ్యాఖ్యలకు స్థానికులు కేరింతలు కొట్టిన పరిస్థితి.

సత్తెనపల్లిలో...వినతుల వెల్లువ
నర్సరావుపేట స్పీకర్ కోడెల సొంత నియోజకవర్గమైతే...సత్తెనపల్లి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. ఈ నియోజకవర్గంలోనూ జగన్ పాదయాత్రకు విశేష స్పందన కొనసాగింది. కోడెల కుటుంబ సభ్యుల దందా తట్టుకోలేని స్థాయికి చేరుకుందంటూ కొందరు స్థానికులు ఈ సందర్భంగా జగన్ దృష్టికి తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అలాగే పంటలకు ధరల్లేకపోవడంపై రైతులు, ప్రత్యేక హోదా పోరాటం మరింత ఉధృతం చేయాలంటూ విద్యార్థులు,108 మంది సిబ్బంది, బార్ అసోసియేషన్ సభ్యులు ఇక్కడ జగన్ ను కలిసి వినతిపత్రాలు ఇవ్వడం గమనార్హం. అలాగే గతంలో ఇక్కడ టిడిపి నుంచి పోటీచేసిన నిమ్మకాయల రాజనారాయణ వైసిపిలో చేరుతుండటం ఖచ్చితంగా టిడిపికి గట్టిదెబ్బేనని చెప్పుకోవచ్చు. మొత్తం మీద గుంటూరు జిల్లాలో తాము ఊహించినదానికన్నా జగన్ పాదయాత్రకు ఈ స్థాయిలో స్పందన లభించడం వైసిపిలో ఆత్మవిశ్వాసం నింపుతుండగా...టిడిపికి ప్రమాద సంకేతాలిస్తోంది.












Click it and Unblock the Notifications