సాయంత్రంలోగా కేంద్రం ప్రకటన రావొచ్చు: సుజన, ఆ భయం వదిలేశా: బాబు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం పైన ఈ రోజు సాయంత్రంలోగా కేంద్రం నుంచి ప్రకటన వచ్చే అవకాశముందని టిడిపి నేత, కేంద్రమంత్రి సుజనా చౌదరి గురువారం నాడు అన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లీని మరోసారి కలిసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బిజెపి, కేంద్రం న్యాయం చేస్తుందనే నమ్మకంతో తాము ఉన్నామని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ వర్కవుట్ చేసేందుకు తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏపీకి సాయం పైన నీతి అయోగ్లో రెండుసార్లు చర్చించామని తెలిపారు.
రాజధాని, వెనుకబడ్డ ప్రాతాల అభివృద్ధికి తాము కేంద్రాన్ని నిధులు కోరామన్నారు. ఏపీకి సాయంపై సాయంత్రంలోగా ప్రకటన వచ్చే అవకాశముందన్నారు. జిల్లాకో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు కేంద్రం సూచనప్రాయంగా నిర్ణయం తీసుకుందన్నారు. ఏపీకి సాయం పైన కేంద్రం వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరుపుతోందన్నారు.
భయం విడిచిపెట్టా!: చంద్రబాబు
విభజన నేపథ్యంలో అందరిలాగే తాను కూడా సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకున్నామని బాధపడ్డానని, అయితే ఇప్పుడు దాన్ని అవకాశంగా మార్చుకుని అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నానని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అన్నారు.
ఈసారి పేదల సంక్షేమంపై దృష్టి పెట్టానని, సమ్మిళిత అభివృద్ధి సాధనగా పని చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో సౌర విద్యుత్ రంగంలో పెట్టుబడులపై బుధవారం నాలుగు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా మాట్లాడారు. దేశంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు ప్రారంభించింది తానే అన్నారు.
మధ్యలో పదేళ్లు ఇబ్బందులు వచ్చాయని, మళ్లీ ఆ సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్తున్నానన్నారు. వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచుకుని, ఆ లాభాలు, సేవల్ని వినియోగదారులకు అందించటమే తన దృష్టిలో సంస్కరణలన్నారు.
విద్యుత్ సరఫరా, పంపిణీ నష్టాలు విశాఖలో 5 శాతం కాగా, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల్లో 7 శాతం అన్నారు. ఇది ప్రపంచ ప్రమాణాలకు దీటైనదన్నారు. ఈ విజయానికి కారణం నిజాయతీపరులైన ప్రజలే అన్నారు. అందుకు వారిని అభినందిస్తున్నానన్నారు.
మంచి రాజకీయాలతో మంచి పాలన సాధ్యమవుతుందన్నారు. రాజకీయాలంటే వ్యవస్థల్ని ధ్వంసం చేయటం కాదని, 2022 నాటికి కచ్చితంగా రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ను ఉత్పత్తి చేస్తామన్నారు. గతంలో సౌర విద్యుత్ ధర యూనిట్కు రూ.14 ఉండేదని, ఇప్పుడు సగాని కంటే తక్కువగా ఉందన్నారు.
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇది సువర్ణావకాశమని, దీన్ని చైనా కంపెనీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఒక్కరోజు ఆలస్యం చేసినా ఆ ఒక్కరోజు వృధా అయినట్లేనన్నారు. పరిశ్రమలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. ఏపీ పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రమని, ఏమాత్రం అనుమానాలున్నా రెండు రోజులు అతిథులుగా వచ్చి అన్నీ పరిశీలించుకోవచ్చునన్నారు.