జనసేన గ్రాఫ్ ఎంత మేర పెరిగింది : దక్కే సీట్లెన్ని..!?
ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. అధికార - ప్రతిపక్ష పార్టీలు ముందస్తుగానే ఎన్నికలకు సిద్దం అవుతున్నాయి. టీడీపీ - జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. వైసీపీ ఒంటరి పోరుకు సిద్ద అవుతోంది. ఇదే సమయంలో గెలుపుపైన ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై పొలిటికల్ మైండ్ గేమ్ ప్రారంభించాయి. ఈ సమయంలోనే మెగా బ్రదర్ నాగబాబు జనసేన గ్రాఫ్ పెరిగిందంటూ కొత్త లెక్కలు చెప్పారు. జనసేన బలం ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటముల్లో డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారుతోంది. నాగబాబు చెప్పిన లెక్కల పైన విశ్లేషణలు మొదలయ్యాయి.

జనసేన గ్రాఫ్ పెరిగిందంటూ
నాగాబాబు వచ్చే ఎన్నికల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ అసలు రాజకీయ పార్టీనే కాదన్నారు. పొత్తులకు ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అదే సమయంలో జనసేన బలం ఏ స్థాయిలో పెరిగిందో వివరించారు. ఇప్పుడు ఆ లెక్కలే పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. 2019 ఎన్నికల్లొ జనసేన బలం దాదాపు 7 శాతంగా ఉంది. ఇప్పుడు జనసేన గ్రాఫ్ 24.5 శాతానికి పెరిగిందంటూ నాగబాబు చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ఈ నాలుగేళ్ల కాలంలో జనసేన బలం ఏకండా మూడు రెట్లకు పైగా పెరిగింది. మరి..జనసేనకు ఇప్పుడు 24.5 శాతం ఓట్ల శాతం ఉంటే.. టీడీపీ - వైసీపీ పరిస్థితి ఏంటనే ప్రశ్న వినిపిస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు రాగా, టీడీపీకి దాదాపుగా 40 శాతం ఓట్లు దక్కాయి. జనసేనకు 7 శాతం, ఇతర పార్టీలకు 3 శాతం మేర వచ్చాయి.

నాగబాబు వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనా
ఇప్పుడు టీడీపీతో జనసేన పొత్తు ఖాయమని భావిస్తున్న వేళ నాగబాబు చేసిన విశ్లేషణ కొత్త సమీకరణాలకు కారణంగా మారుతోంది. నాగబాబు చెబుతున్నట్లుగా 7 నుంచి 24.5 శాతానికి జనసేన బలం పెరిగితే ఎవరి ఓటింగ్ షేర్ జనసేనకు బదిలీ అయిందనేది ఇప్పుడు చర్చ. ఇది ఎన్నికల ముందు కేడర్ లో జోష్ నింపేందుకు చెప్పిన లెక్కలా.. వాస్తవంగా సర్వేల ఆధారంగా చేసిన విశ్లేషణా అనేది తేలాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో కేవలం 1.95 శాతం ఓట్ల తేడాతో టీడీపీ అధికారంలో..వైసీపీ ప్రతిపక్షంలో కూర్చుకున్నాయి. వైసీపీకి 67 సీట్లు వస్తే..టీడీపీకి 102 స్థానాలు దక్కాయి. మిత్రపక్ష బీజేపీ 4 సీట్లలో గెలిచింది. ఇప్పుడు జనసేన ఏకంగా 24.5 శాతం ఓట్ షేర్ ఉంటే అసలు పొత్తుల అవసరమే లేదనే వాదన మొదలైంది.

టీడీపీతీ పొత్తు - జనసేన సీట్లు
ఇప్పుడు టీడీపి- జనసేన పొత్తు ఖాయమని అందరూ దాదాపుగా నిర్ణయానికి వచ్చేసారు. టీడీపీతో పొత్తుల సమయంలో సీట్ల సర్దుబాటు పైన చర్చ జరగాల్సి ఉంది. జనసేనాని తమకు గౌరవం దక్కితేనే పొత్తు ఉంటుందని తేల్చి చెప్పారు. ఆ గౌరవం అంటే సీట్ల దగ్గర నుంచి అధికారం వరకు అన్ని అంశాలు అందులోనే ఉంటాయి. కానీ, ఇప్పుడు నాగబాబు చెబుతున్నట్లుగా జనసేన గ్రాఫ్ 24.5 శాతానికి పెరిగితే పవన్ కు పొత్తుల అవసరమే లేదు. పవన్ కింగ్ లేదా కింగ్ మేకర్ కావటం ఖాయం. సీట్లలోనూ అంచనాలకు భిన్నంగా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు నాగబాబు చెబుతున్న లెక్కల వెనుక ప్రాతిపదిక ఏంటనేది జనసేన నేతలు స్పష్టం చేయాలి.












Click it and Unblock the Notifications