సరిపోయారిద్దరు: ఒకే ఫ్రేమ్లో చిరంజీవి, పవన్
అమరావతి: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రాబోతోన్న లేటెస్ట్ మూవీ.. వ్యూహం. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలను కథాంశంగా చేసుకుని తెరకెక్కుతోందీ సినిమా. దాసరి కిరణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తోన్నారు. ఇదివరకు వంగవీటి సినిమాను నిర్మించింది ఆయనే. ఇటీవలే ఈ సినిమాలో నటిస్తోన్న పాత్రధారుల ఫొటోలను రామ్ గోపాల్ వర్మ విడుదల చేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన భార్య భారతిరెడ్డి పాత్రల ఫొటోలను రిలీజ్ చేశారు. వైఎస్ జగన్ పాత్రను తమిళనటుడు అజ్మల్ పోషిస్తోన్నాడు. వైఎస్ భారతి క్యారెక్టర్లో మానస రాధాకృష్ణన్ నటిస్తోన్నారు. దీని తరువాత వ్యూహం సినిమాకు సంబంధించిన పలు వర్కింగ్ స్టిల్స్ను రామ్ గోపాల్ వర్మ.. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేస్తూ వచ్చారు.

ఇదివరకే తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడి వర్కింగ్ స్టిల్ కూడా బయటికొచ్చింది. ఈ నెల 24వ తేదీన టీజర్ కూడా విడుదలయింది. సినిమా ఎలా ఉండబోతోందనేది తేల్చేశారు రామ్ గోపాల్ వర్మ. రెండు పార్టులుగా చిత్రకరణను జరుపుకొంటోంది వ్యూహం. తొలి పార్ట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణం, వైఎస్ జగన్ ఓదార్పుయాత్ర వంటివి ఉంటాయి.
కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్ రాజీనామా చేయడం, కడప లోక్సభ ఉప ఎన్నికలో రికార్డుస్థాయి మెజారిటీతో ఘన విజయం సాధించడం, అనంతరం ఆయనపై ప్రత్యర్థి పార్టీలు బనాయించిన అక్రమ కేసుల వ్యవహారం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం వంటి అంశాలను రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తోన్నారు. ఈ ఏడాదే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
రెండో పార్ట్లో 2014 తరువాతి రాజకీయ పరిణామాలు ఉంటాయని తెలుస్తోంది. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ అసెంబ్లీలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వంపై పోరాడిన తీరు, మహా ప్రస్థానం పాదయాత్రకు దారి తీసిన పరిణామాలను రెండో పార్ట్లో రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించనున్నారు.2019 ఎన్నికల్లో జగన్ సాధించిన తిరుగులేని విజయాన్ని ఇందులో చూపించనున్నారు.

వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం సంక్షేమాభివృద్ధి పథకాల అమలు, వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాలు విలేజ్ క్లినక్స్ వంటి గ్రామీణ స్థాయిలో చోటు చేసుకున్న విప్లవాత్మక మార్పులను రామ్ గోపాల్ వర్మ రెండో పార్ట్లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు రెండో పార్ట్ విడుదలవుతుందని చెబుతున్నారు.
తాజాగా వ్యూహం సినిమాలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్యారెక్టర్ను కూడా సెట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో బీఎస్పీ, సీపీఐ, సీపీఎంలతో పొత్తుపెట్టుకుని పోటీ చేసిన జనసేన ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. జనసేన తరఫున ఒకే ఒక్క ఎమ్మెల్యే విజయం సాధించారు.
జనసేన ఘోర పరాజయాన్ని రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమాలో ప్రస్తావించనున్నారు. దీనికి సంబంధించిన వర్కింగ్ స్టిల్ను ఆయన తాజాగా విడుదల చేశారు. తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవిని కలుసుకొన్న అనంతరం పవన్ కల్యాణ్ వెనుదిరిగి వెళ్తోన్న స్టిల్ అది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఈ సీన్ను ఆర్జీవీ సెట్ చేసి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications