ఏపీలో భూ ప్రకంపనలు: భయంతో పరుగులు తీసిన జనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు రెండు సెకన్లకుపైగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. సుమారు రెండు సెకన్లకుపైగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
ఇళ్లు, కార్యాలయాలు నుంచి బయటకు పరుగులు తీశారు. అంతా రోడ్లపైకి వచ్చి భయం భయంగా గడిపారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరులో భూమి రెండు సెకన్లపాటు కంపించింది. గుంటూరుజిల్లాలోని వినుకొండ, శావల్యపురం, కారుమంచి, మతుకుమల్లి, కృష్ణాపురం తదితర ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలతో శబ్దాలు వచ్చాయి.
భూకంపన తీవ్రతకు ఇళ్లు, కార్యాలయాల్లోని వస్తువులు కిందపడ్డాయి. దీంతో భయాందోళనలకు గురైన జనం రోడ్లు, ఖాళీ ప్రదేశల్లోకి పరుగులు తీశారు. ఆ తర్వాత భూ ప్రంకపనలు తగ్గినప్పటికీ మరోసారి ఏమైనా ప్రకంపనలు చోటు చేసుకుంటాయోనని భయపడుతున్నారు.
అయితే, ఎక్కడా కూడా ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని తెలుస్తోంది. ఈ ప్రకంపనలపై ప్రభుత్వ, వాతావరణ శాఖ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.