చేతులు కల్పిన తెరాస, మజ్లిస్: కేబినెట్లో అక్బర్కు ఛాన్స్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి, మజ్లిస్ పార్టీలు చేతులు కలిపాయి. సోమవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావు, కల్వకుంట్ల తారక రామారావు మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసి, ముఖ్యనేతలు అక్బరుద్దీన్ ఓవైసీ తదితరులతో భేటీ అయ్యారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు.
ఇద్దరి ఉద్దేశ్యం ఒక్కటే: నాయిని
మజ్లిస్, తెరాస పార్టీల ఉద్దేశ్యం హైదరాబాదు అభివృద్ధి అని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. ఇరువురం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. తెలంగాణను సెక్యులర్ రాష్ట్రంగా నిలబెట్టాలనేదే తమ ఉద్దేశ్యమన్నారు.

కోటి ఆశలతో ప్రజలు: కెటిఆర్
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ మీద ప్రజలు కోటి ఆశలతో ఉన్నారని కెటి రామారావు చెప్పారు. పది జిల్లాలకు గుండెకాయ వంటి హైదరాబాద్ అభివృద్ధి శరవేగంగా జరగాలని, నగరంలో శాంతియత వాతావరణం నెలకొనాలని కెటిఆర్ ఆకాంక్షించారు. కలిసి పని చేస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు.
మా సహకారం ఉంటుంది: అసద్
కొత్తగా ఏర్పాటు కాబోయే తెరాస ప్రభుత్వానికి తమ సహకారం ఉంటుందని మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు. హైదరాబాదును అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. నీళ్లు, విద్యుత్ తదితర ఎన్నో సమస్యలు ఉన్నాయని చెప్పారు. తెలంగాణలో లౌకికవాదాన్ని బలపర్చేందుకు తాము తెరాసకు మద్దతిస్తున్నామన్నారు. ప్రభుత్వంలో చేరడం ముఖ్యం కాదని దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలపాల్సి ఉందన్నారు. కాగా అక్బరుద్దీన్ ఓవైసీని కేబినెట్లోకి తీసుకునే అవకాశముందని అంటున్నారు.












Click it and Unblock the Notifications