అవినీతికి మూలం ఆదిమూలం: విద్యాశాఖలోనూ, భూకబ్జాలలోనూ మంత్రి సురేష్ అవినీతిచిట్టా ఇదేనన్న టీడీపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ పాలన చేపట్టిన నాటి నుండి అరాచక పాలన కొనసాగుతుందని, అవినీతి రాజ్యమేలుతుందని తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. ఇటీవల జే గ్యాంగ్ అవినీతి భాగోతం అంటూ ఏపీ మంత్రుల అవినీతి చిట్టాను బయటపెడుతున్న తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ ఖాతాలో తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ ని టార్గెట్ చేసి తీవ్ర ఆరోపణలు చేసింది. మంత్రి ఆదిమూలపు సురేష్ విద్యాశాఖలో చేసిన అవినీతిని, దోపిడీని టీడీపీ అధికార ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది.

మంత్రి ఆదిమూలపు సురేష్ అవినీతి చిట్టా బయటపెట్టిన టీడీపీ
ట్విట్టర్ వేదికగా మంత్రి ఆదిమూలపు సురేష్ అవినీతి చిట్టా బయటపెట్టిన టీడీపీ విద్యాశాఖా మంత్రిగా ఏపీలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిన వైసీపీ నేత ఆదిమూలపు సురేష్ అంటూ పేర్కొంది. కరోనా కాలంలో జగన్ రెడ్డి అనుగ్రహం కోసం మొండిగా వ్యవహరించి, అనేక మంది ఉపాధ్యాయుల, విద్యార్థి కుటుంబ సభ్యుల మరణాలకు కారణమయ్యారని ధ్వజమెత్తిన. ఇక ఈయనగారి అవినీతి చిట్టా మామూలుగా లేదు అని పేర్కొన్న టిడిపి ఆదిమూలపు సురేష్ మొత్తం 1846 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని లెక్కలు చెప్పింది.
విద్యాశాఖలో ఆదిమూలపు సురేష్ అవినీతి లెక్కలు చెప్పిన టీడీపీ
నాడు నేడులో కమిషన్ల ద్వారా ఆదిమూలపు సురేష్ 340 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారని, టీచర్ల బదిలీలలో లంచాలు తీసుకుని 75 కోట్ల రూపాయలు అవినీతికి పాల్పడ్డారని, కోడిగుడ్ల కాంట్రాక్ట్ లో కమిషన్ ద్వారా 30 కోట్ల రూపాయలు ఆదిమూలపు సురేష్ సంపాదించారని టిడిపి పేర్కొంది. పల్లి చిక్కీ లో అవినీతి ద్వారా ఆదిమూలపు సురేష్ రెండు వందల కోట్ల రూపాయలు సంపాదించారని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. స్కూల్ యూనిఫామ్ లు, బ్యాగ్ , బుక్స్ లో అవినీతి ద్వారా 86 కోట్ల రూపాయలు సంపాదించారని టీడీపీ పేర్కొంది.

కమీషన్లు, ఏ ట్యాక్స్ లు.. భూ కబ్జాలతో ఆదిమూలపు అక్రమార్జన
నియోజకవర్గంలో పోస్టింగులలో చేతివాటం ద్వారా 35 కోట్ల రూపాయలు, ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు నుంచి ఏ ట్యాక్స్ ద్వారా 270 కోట్ల రూపాయలు, డిగ్రీ, జూనియర్ కళాశాల నుంచి అక్రమ వసూళ్లు 130 కోట్ల రూపాయలు ఆదిమూలపు సురేష్ సంపాదించారని టిడిపి ఆరోపించింది. అంతేకాదు భూ మాఫియా ద్వారా ఆదిమూలపు సురేష్ వందల కోట్ల రూపాయలు సంపాదించారని తెలుగుదేశం పార్టీ విమర్శించింది. మార్కాపురంలో జార్జ్ ఇంజనీరింగ్ కాలేజీ పేరుతో 90 ఎకరాలు కబ్జా చేశారని తద్వారా 65 కోట్ల రూపాయలు సంపాదించారని టిడిపి పేర్కొంది.

ఇళ్ళ పట్టాలలో అవినీతి, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి ఏ ట్యాక్స్
పుల్లలచెరువులో 289 ఎకరాలు అసైన్డ్ భూముల ఆక్రమణ ద్వారా 30 కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారని వెల్లడించింది. గిద్దలూరులో 327 ఎకరాల ద్వారా 40 కోట్లు, త్రిపురాంతకంలో 365 ఎకరాల ద్వారా 55 కోట్లు, డోర్నాలలో 205 ఎకరాల ద్వారా 20 కోట్లు, పెద్దారవీడులో 330 ఎకరాల ద్వారా 35 కోట్లు, ఎర్రగొండపాలెంలో అసైన్డ్ భూముల ఆక్రమణ ద్వారా 40 కోట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుండి ఏ ట్యాక్స్ ద్వారా 85 కోట్లు, ఇళ్ల పట్టాలలో అవినీతి ద్వారా పది కోట్ల రూపాయలు అక్రమార్జన చేశారని టీడీపీ పేర్కొంది.

అవినీతికి మూలం ఆదిమూలం .. టీడీపీ ఆరోపణ
ఇసుక డంపింగ్ యార్డ్ లో నుండి అవినీతి ద్వారా మూడు వందల కోట్ల రూపాయలు ఆదిమూలపు సురేష్ అక్రమంగా సంపాదించారని తెలుగుదేశం పార్టీ పేర్కొంది.మొత్తంగా మంత్రి అవినీతి చిట్టాను వెల్లడించిన టిడిపి అవినీతికి మూలం ఆదిమూలం అంటూ పేర్కొంది. 1846 కోట్ల రూపాయల అవినీతికి మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్పడ్డారని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. విద్యా దోపిడీ మంత్రి అవినీతి బాగోతాన్ని పేర్కొని, రాష్ట్రంలోని మంత్రుల అవినీతిని ఏకరువు పెడుతోంది టిడిపి.












Click it and Unblock the Notifications