పోలవరం ప్రాజెక్టు అనుకున్నారా ?, లేక ఏమనుకున్నారు, అగ్నిప్రమాదంపై సీరియస్
పోలవరం ప్రాజెక్టు కు సంబంధించిన ఫైల్స్ దాహనం అయిన కేసులో బాధ్యులైన వారి పైన కఠిన చర్యలు తీసుకుంటామని, తప్పు చేసిన వారిని ఎవ్వరినీ ఎలాంటి పరిస్థితులు వదిలే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి కందుల దుర్గేష్, పోలవరం ప్రాజెక్ట్ కు సంబంధించిన సీనియర్ అధికారులు పరిశీలించారు.
తగలబడిన ఫైల్స్ ను వెంటనే పరిశీలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని, పోలవరం ప్రాజెక్ట్ ఫైల్స్ భద్రపరచడం లో నిర్లక్షంగా వ్యవహరించిన అక్కడ సిబ్బందిపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫైల్స్ ఇలాగేనా మీరు భద్రపరిచేది, ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ జీతాలు తీసుకుంటున్న మీరు అదే ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైల్స్ ను ఇంత నిర్లక్ష్యంగా గాలికి వదిలేస్తారా అని మంత్రి కందుల దుర్గేష్ అక్కడ సిబ్బందిని సూటిగా ప్రశ్నించారు.

అయితే కాలిపోయిన ఫైల్స్ జిరాక్స్ పేపర్లు అని రాజమహేంద్రవరం ఆర్టీవో శివజ్యోతి మంత్రికి చెప్పడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలిపోయింది జిరాక్స్ పేపర్లు అయితే ఒరిజినల్ పేపర్లు భద్రంగా ఉన్నాయా, ఎక్కడ ఉన్నాయి అంటూ మంత్రి కందుల దుర్గేష్ రాజమహేంద్రవరం ఆర్డీఓ శివజ్యోతిని ప్రశ్నించారని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయడానికి ఇక్కడి ఫైల్స్ దహనం చేశారా అని మంత్రి కందుల దుర్గేష్ అక్కడి సిబ్బందిని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్టు సంబంధించిన ఫైల్స్ దహనం కావడానికి కారణమైన ఎవ్వరినీ ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని, చట్టపరంగా అందరి మీద చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ అక్కడి సిబ్బందిని హెచ్చరించారు. పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి వెంటనే నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు, పోలీసులకి మంత్రి కందుల దుర్గేష్ ఆదేశాలు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒకచోట, ఏదో ఒక విధంగా అగ్నిప్రమాదాలు జరగడం, ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఫైల్స్ దహనం కావడంతో చంద్రబాబు ప్రభుత్వం సీరియస్ అయ్యింది. మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరగడం, శనివారం తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో అగ్నిప్రమాదం జరగడం, అదేరోజు పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో కొన్ని ఫైల్స్ దహనం కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.












Click it and Unblock the Notifications