చంద్రబాబు ఓటమిని అంగీకరించారు - ఇదే సాక్ష్యం : మంత్రి అమర్నాధ్
టీడీపీ అధినేత చంద్రబాబు పై మంత్రి గుడివాడ అమర్నాధ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన మంత్రి స్పందించారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు కాదని, టీడీపీకి ఇవే చివరి ఎన్నికలుగా మారుతాయని జోస్యం చెప్పారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు తన ఓటమిని అంగీకరించారని మంత్రి చెప్పుకొచ్చారు.
చంద్రబాబు పోటీ చేయకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టమేమీ లేదన్నారు. తులసి నీళ్ళు పోస్తేనే బ్రతుకుతాను అన్నట్లు చంద్రబాబు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రంలో ఏ వర్గానికి మంచి చేశారని మంత్రి ప్రశ్నించారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు ఎక్స్ ట్రా ప్లేయర్ గా అభివర్ణించారు. చంద్రబాబుకు సత్తా ఉంటే 175 అసెంబ్లీ సీట్లు.. 25 లోక్ సభ స్థానాల్లో పోటీ చేస్తానని ప్రకటించాలని సవాల్ చేసారు. అలా చెప్పలేకపోతే 2024 ఎన్నికలే చివరివిగా మారుతాయని చెప్పుకొచ్చారు. అధికారం కోసం తన సతీమణిని కూడా లాగుతున్నారని మంత్రి ఫైర్ అయ్యారు.
చంద్రబాబు తన ఓటమిని గుర్తించే ముందు నుంచే ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారని.. ఎవర్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటున్నారంటూ మంత్రి అమర్నాధ్ వ్యాఖ్యానించారు. తాజాగా కర్నూలు పర్యటనలో భాగంగా చంద్రబాబు టీడీపీని గెలిపిస్తే సరే, లేకుంటే తనకు ఇవే చివరి ఎన్నికలని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ వేదికగా కొద్ది నెలల క్రితం తాను చేసిన శపధం గురించి చంద్రబాబు వివరించారు. ప్రస్తుతం టీడీపీ గాలి వీస్తోందని, వైసీపీ కొట్టుకుపోవటం ఖాయమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన వైసీపీ మంత్రులు మండిపడుతున్నారు. చంద్రబాబు తనకు ఓడిపోతానని తెలిసి..ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారంటూ ఫైర్ అవుతున్నారు.