చంద్రబాబు- నారా లోకేష్- పవన్ ఓడిపోనున్నారు - రాసి పెట్టుకోవచ్చు..!!
అమరావతి: పేదలందరికీ ఇళ్లు పథకంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఆందోళనపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆయన చేపట్టిన విజయనగరం జిల్లా గుంకలాం పర్యటనను తప్పుపట్టారు. ఈ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ను వీకెండ్ గెస్ట్ ఆర్టిస్ట్గా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే పవన్ కల్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ చూడలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.

జగనన్న ఇళ్లు..
తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జోగి రమేష్ మాట్లడారు. పెడనతో పాటు మంగళగిరిలో జగనన్న కాలనీలకు వెళ్లిన జనసేన నాయకులను అక్కడి లబ్దిదారులు తరిమి కొట్టారని గుర్తు చేశారు. ఈ ఆందోళన కార్యక్రమం జగనన్న ఇళ్లు.. పవన్, చంద్రబాబు కన్నీళ్లుగా మారిందని వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేస్తోన్న ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేయడానికి పవన్ కల్యాణ్ ప్రతి వీకెండ్లో గెస్ట్ ఆర్టిస్ట్గా ఏపీకి పవన్ వస్తున్నాడని విమర్శించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా..
దేశంలో ఎక్కడా లేని విధంగా 31 లక్షల మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగనే అని, రెండు దశల్లో 21 లక్షల ఇళ్లను నిర్మిస్తోన్నామని జోగి రమేష్ అన్నారు. వాటి నిర్మాణ పనులు శర వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. అంతా సవ్యంగా సాగుతుంటే పవన్ కల్యాణ్కు కడుపు మంట ఎందుకని ప్రశ్నించారు. గుంకలాంలో 10 వేల ఇళ్ల నిర్మాణం జరుగుతున్నాయని, అవన్నీ పవన్ కల్యాణ్ కనిపించట్లేదని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు హయాంలో..
తెలుగుదేశం పార్టీ- బీజేపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉమ్మడి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటినీ చంద్రబాబు తుంగలో తొక్కినప్పటికీ పవన్ కల్యాణ్ ప్రశ్నించలేదని పేర్కొన్నారు. అర్హులైన పేదలందరికీ మూడు సెంట్లలో ఉచితంగా పక్కాఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారని, ఒక్కటంటే ఒక్క పేద కుటుంబానికి ఇంటి స్థలం ఇచ్చిన పాపాన పోలేదని జోగి రమేష్ గుర్తు చేశారు. అప్పుడు పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

చంద్రబాబును ఎందుకు నిలదీయలేదు..
2014 నుంచి 2019 వరకు కనీసం ఒక సెంటు భూమి కూడా ఇవ్వలేదని, అప్పుడు చంద్రబాబు చొక్కా ఎందుకు పట్టుకోలేదని జోగి రమేష్ పవన్ కల్యాణ్ను ప్రశ్నించారు. పవన్కళ్యాణ్ చెప్పేవన్నీ పిట్ట కథలేనని, అతని పిచ్చి మాటలు విని పిల్ల సైకోలు కూడా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. వారు లేఅవుట్లలోకి వెళ్తే, లబ్ధిదారులే అడ్డుకుంటున్నారని, ఇంతకంటే అవమానం లేదని పేర్కొన్నారు. పిల్ల సైకోలను రెచ్చగొట్టి, పవన్ కల్యాణ్ మాత్రం హైదరాబాద్ పారిపోతున్నాడని ఎద్దేవా చేశారు.

ఓటమి ఖాయం..
పవన్ కళ్యాణ్, ఆయన దత్త తండ్రి చంద్రబాబుది రాక్షసక్రీడ అని, ఇద్దరూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోన్నారని జోగి రమేష్ ఆరోపించారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు చంద్రబాబు కూడా ఓడిపోబోతున్నారని, కావాలంటే రాసిపెట్టుకోవచ్చని జోగి రమేష్ తేల్చి చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇవ్వకూడదని కోర్టులకెక్కారని, ప్రజలు ఎప్పటికీ క్షమించరని అన్నారు.












Click it and Unblock the Notifications