ఎగ్జిట్ పోల్స్ వేళ.. పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేసిన వైసీపీ
Exit Polls: దేశంలో చివరి విడత సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బిహార్- 8, చండీగఢ్- 1, హిమాచల్ ప్రదేశ్- 4, జార్ఖండ్- 3, ఒడిశా- 6, పంజాబ్- 13, ఉత్తరప్రదేశ్- 13, పశ్చిమ బెంగాల్- 9 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ముమ్మరంగా సాగుతోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మోదీ పోటీలో నిలిచిన ఉత్తరప్రదేశ్లోని వారణాశి నియోజకవర్గానికీ అదే రోజున పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 6:30 గంటలకు అధికారికంగా పోలింగ్ ముగుస్తుంది. అప్పటివరకు క్యూలో ఉన్న వారికి ఓటు వినియోగించుకునే అవకాశం ఇస్తారు పోలింగ్ సిబ్బంది.

కాగా సాయంత్రం 6:30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలవుతుంది. మే 13వ తేదీన ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్సభ, తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కసారిగా వెలువడటం ప్రారంభమౌతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చు.
ఇండియాటుడే- మైయాక్సిస్, చాణక్య, ఇండియా టీవీ, న్యూస్ 18, సీఎన్బీసీ, ఎన్డీటీవీ.. వంటి పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏపీ- తెలంగాణకు చెందిన ఆరా వంటి ఎన్నికల సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించబోతోన్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని మద్దిరాల గ్రామంలో ఈ ప్రెస్మీట్ను ఏర్పాటు చేశారు ఆరా మస్తాన్.

ఈ క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మంత్రి జోగి రమేష్.. పార్టీ యంత్రాంగానికి సూచనలు జారీ చేశారు. రాష్ట్రంలో మరోసారి తమ పార్టీ అధికారంలోకి రాబోతోందని, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతోన్నారని అన్నారు. చిట్టచివరి కార్యకర్త వరకు అందరూ సంబరాలకు సిద్ధం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఎగ్జిట్ పోల్స్తో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి దిమ్మ తిరగి బొమ్మ కనపడబోతోందని, ఎన్నికల ఫలితాలు వెలువడే రోజైన జూన్ 4వ తేదీన ఆయనకు మూర్ఛ వస్తుందని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. మూర్ఛ రోగంతో ఆయన ఆసుపత్రిలో చేరడం తథ్యమని చురకలు అంటించారు.
ఈ రాష్ట్రాన్ని మరోసారి వైఎస్ జగన్ పరిపాలించాలనేది ప్రజల కోరిక అని, ఆ ఆకాంక్షతోనే మే 13వ తేదీన జరిగిన పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని జోగి రమేష్ అన్నారు. అన్ని వర్గాల ప్రజల దీవెనలతో జగన్.. మరో అయిదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలిస్తారని చెప్పారు.












Click it and Unblock the Notifications