భార్య పేరు అడ్డుపెట్టుకొని చంద్రబాబు రాజకీయం - జూ ఎన్టీఆర్ మమ్మల్ని కంట్రోల్ చేయటమా : కొడాలి నాని సంచలనం..!!
ఏపీ మంత్రి కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పైన ఫైర్ అయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ..చంద్రబాబు చేసిన వ్యాఖ్యల మీద కొడాలి నాని స్పందించారు. అసెంబ్లీలో కానీ, బయట కానీ తాము భువనేశ్వరి గురించి ఎప్పుడూ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తన రాజకీయం కోసం భార్య పేరు చెబుతూ తన భార్యను అల్లరి చేసుకుంటున్నారంటూ మండి పడ్డారు. చంద్రబాబు తన భార్యను తానే అల్లరి చేసుకుంటూ తనను క్షమాపణ చెప్పమనటం ఏంటని ప్రశ్నించారు.

భువనేశ్వరి పేరుతో రాజకీయం
తనకు సెక్యూరిటీ అవసరం లేదని... చంద్రబాబు సైతం జెడ్ ప్లస్ భద్రత వదిలేయాలని డిమాండ్ చేసారు. వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి చంద్రబాబు అక్కడ కూడా తన భార్యను అవమానించారని..తాను అసెంబ్లీకి అందుకే వెళ్లటం లేదని చెప్పటం పైన మంత్రి అభ్యంతరం వ్యక్తం చేసారు. ఇదంతా రాజకీయం కోసం చంద్రబాబు చేస్తున్న డ్రామాగా అభివర్ణించారు. వరదల గురించి ఏమైనా మాట్లాడాలని... అంతే కానీ, ప్రతీదీ రాజకీయం చేయటం సరి కాదన్నారు. భువనేశ్వరి పేరుతో రాజకీయం చేస్తే నందమూరి కుటుంబం మద్దతు వస్తుందనేది చంద్రబాబు ఆలోచనగా చెప్పుకొచ్చారు.

నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులు
నందమూరి కుటుంబ సభ్యులు అమాయకులని ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే ఆ పార్టీ నాశనం అవుద్దని చంద్రబాబు చెప్పినా విన్నారు. గొర్రె కసాయి వాడినే న్నమ్ముతుంది..చంద్రబాబు ఏది చెప్పినా నమ్మేస్తారు. అంటూ నందమూరి కుటుంబాన్నిఉద్దేశించి వ్యాఖ్యానించారు. నందమూరి కుటుంబం అంటే ముఖ్యమంత్రికి కూడా గౌరవం ఉంటుందన్నారు. జూనియర్ ఎన్టీఆర్ తమను కంట్రోల్ చేయటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు వరద బాధితుల వద్ద సీఎం గాల్లో వచ్చాడు.. గాల్లో కలిసిపోతాడంటూ చేసిన వ్యాఖ్యల పైన కొడాలి నాని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు.

జగన్ పైన కేసులు పెట్టిన వాళ్లు ఏమయ్యరు
జగన్ పైన అక్రమంగా కేసులు పెట్టించిన సోనియా ఏమయ్యారో..కేసులు పెట్టిన శంకరరావు పరిస్థితి ఏంటో... ఎర్రన్నాయుడు ఏమయ్యాడో అందరూ చూసారని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ వాతావరణం బాగోలేదని చెప్పినా వినకుండా.. ప్రజల మీద ప్రేమతో వెళ్లి ప్రమాదంలో మరణించారని చెప్పారు. ఆయన మరణించినా..ప్రజల గుండెల్లొ బతికే ఉన్నారని చెప్పారు. జగన్ పైన కేసులు నమోదు చేసిన వ్యక్తి ఇప్పుడు స్టూడియోల్లో కూర్చుంటున్నారని వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాలకు మంత్రులు..ఎమ్మెల్యేలు..అధికారులను సీఎం పంపించారని వివరించారు.

వరద ప్రాంతాలకు వెళ్లి రాజకీయాలా
తన సొంత జిల్లా పైన జగన్ కంటే చంద్రబాబు కు ఎక్కువ ప్రేమ ఉంటుందా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులోకి ఆరు గంటల్లో 32 టీఎంసీల నీరు వస్తే..ఎలా పంపిస్తారని అడిగారు. తెల్లవారే సరికి ప్రాజెక్టు కొట్టుకుపోయిందని వివరించారు. బాధితులకు పరిహారం ప్రకటించారని గుర్తు చేసారు. చంద్రబాబు అక్కడకు వెళ్లి వరదల్లో మరణించిన వారి వద్ద కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications