కూటమి ఎంట్రీతో గెలుపు పై వైసీపీ తాజా అంచనాలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగింది. సీట్ల సర్దుబాటు పైన ఒకటి రెండు రోజుల్లో తుది ప్రకటన రానుంది. వైసీపీ ఇప్పటికే తమ అభ్యర్దుల ను ప్రకటించింది. కూటమి వ్యూహాలతో జగన్ అలర్ట్ అయ్యారు. షెడ్యూల్ తరువాత గేమ్ మార్చారు. గెలుపైన వైసీపీలో అంచనాలు మారుతున్నాయి. ఇక ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో, పోరు మరింత ఆసక్తి కరంగా మారుతోంది.
కూటమి వర్సస్ జగన్
మూడు పార్టీల కూటమిగా ఎన్డీఏ బరిలోకి దిగింది. ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్డీఏ గెలుపు కోరుతూ ఎన్నికల సభ నిర్వహించారు. అటు కాంగ్రెస్, వామపక్షాల కూటమి ఎన్నికల యుద్దంలోకి దిగుతోంది. సీఎం జగన్ ఈ నెల 27వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నారు. నిత్యం బహిరంగ సభతో ప్రచారం ముగిసే వరకూ ప్రజల్లోనే ఉండేలా షెడ్యూల్ ఖరారు చేసారు. అటు కూటమి వరుస సభలకు ప్లాన్ చేస్తోంది చంద్రబాబు, జగన్ వేర్వేరుగా ప్రచారం చేస్తూనే..మూడు పార్టీలు కలిసి సభల నిర్వహణ పైన ఒక నిర్ణయానికి వచ్చారు. ప్రధాని సభ తరువాత ఏపీలో కూటమి పైన ప్రజాభిప్రాయం ఎలా ఉందనే అంశం ఆసక్తి కరంగా మారుతోంది. కూటమితో పాటుగా వైసీపీ ప్రజల మూడ్ తెలుసుకొనేందుకు వరుస సర్వేలు చేయిస్తున్నాయి.

హోరా హోరీ పోరు
ఎన్డీఏ కూటమి కంటే క్షేత్ర స్థాయిలో అభ్యర్దులు, ప్రచారం విషయంలో జగన్ ముందు వరుసలో ఉన్నారు. మూడు పార్టీల నేతలు కలిసి కట్టుగా ప్రచారానికి సిద్దం అవుతున్నా..జగన్ వైసీపీకి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారానికి సిద్దమయ్యారు. ఇదే సమయంలో జగన్ ఎన్నికల ప్రచారం పైన సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొత్తులు, తాము సాధించే సీట్ల పైన కీలక వ్యాఖ్యలు చేసారు. పొత్తులను తాము ముందుగానే ఊహించామని చెప్పారు. తాము అంచనా వేసిన సీట్ల కంటే పొత్తులతో కూటమిగా ఆ మూడు పార్టీలు బరిలోకి దిగిన తరువాత క్షేత్ర స్థాయిలో తమకు మరింత మద్దతు కనిపిస్తుందని వివరించారు. గతంలో అనుకున్న సంఖ్య కంటే ఇంకా అధిక సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేసారు. జగన్ మూడు రాజధానులకు కట్టుబడి వున్నారని చెప్పారు.
గెలుపు పై ధీమా
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కర్నూలును న్యాయరాజధాని ఇస్తామని మంత్రి హామీ ఇచ్చారు. 29న ఎమ్మిగనూరులో 'మేమంతా సిద్ధం' సభలు నిర్వహించనున్నామని మంత్రి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో అమలు చేసిన పథకాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు వివరిస్తారన్నారు. మేమంతా సిద్ధం సభ సక్సెస్ అవుతుందని పెద్దిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అనూహ్యంగా పలు సర్వే సంస్థలు టీడీపీ, జనసేనకు వచ్చే సీట్ల సంఖ్య..బీజేపీతో పొత్తు ఖాయమైన తరువాత తగ్గుతున్నట్లుగా విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. దీంతో..హోరా హోరీగా మారుతున్న ఈ ఎన్నికల యుద్దంలో జగన్ వర్సస్ కూటమి ఎన్నికల రాజకీయం మరింత ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications