'వైసీపీ నేతలు మానసిక రోగులు': పవన్ కాకినాడ సభకు బీజేపీ మద్దతు
హైదరాబాద్: సోమవారం ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో శుక్రవారానికి వాయిదా పడింది. హోదాపై చర్చ చేపట్టాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టు ముట్టడంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది.
ఈ సందర్భంగా మంత్రి రావెల కిశోర్ బాబు మాట్లాడుతూ వైసీపీ సభ్యులు మానసిక రోగులుగా మారి శాసనసభలో ఆందోళన చేయడం మానుకోవాలని హితవు పలికారు. ఏపీకి హోదాపై మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష నేత వైయస్ జగన్కు లేదని అన్నారు.
కేవలం తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునేందుకు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారని ఆరోపించారు. ఎన్నోసార్లు ఢిల్లీకి వెళ్లిన వైయస్ జగన్ హోదా కోసం ఎందుకు కేంద్రంతో మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని, ప్రతిపక్షం ఇప్పటికైనా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన కోరారు.

పవన్ కాకినాడ సభకు మద్దతిస్తా: మంత్రి మాణిక్యాలరావు
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ శుక్రవారం కాకినాడలో నిర్వహించనున్న ఆత్మగౌరవ సభకు తాను వ్యక్తిగతంగా మద్దతు తెలుపుతానని మంత్రి మాణిక్యాలరావు చెప్పారు. ప్రత్యేక హోదా కన్నా కేంద్రం ఇచ్చిన ప్యాకేజీనే మంచిదనే విషయం త్వరలోనే అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు.
కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్లను ప్రభుత్వం నెరవేరుస్తోందని ఆయన చెప్పారు. ఆయన ఇంకా మొండిగా వ్యవహరిస్తారని అనుకోవడం లేదని అన్నారు. ఇదిలా ఉంటే ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్కు మంత్రి మాణిక్యాలరావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మంచి సలహాలు ఇస్తే జగన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతోపాటు మంచి వేతనం కూడా ఇస్తామని ఆయన ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications