పవన్ కు మంత్రి రోజా ఛాలెంజ్ - హీరోలంతా తల దించుకుంటున్నారు..!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. పవన్ వ్యాఖ్యలు వింటుంటే నవ్వొస్తుందని చెప్పుకొచ్చారు. వీకెండ్ పొలిటీషియన్ గా రావటం.. ఆదివారం వచ్చి అజ్ఞానంగా మాట్లాడి పోవలం అలవాటుగా మారిందని ఎద్దేవా చేసారు. పవన్కు 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. జనసేనకు 175 స్థానాల్లో అభ్యర్థులే లేరు కానీ.. అసెంబ్లీ జెండా ఎగురవేస్తామంటున్నారని ద్వజమెత్తారు. ఎమ్మెల్యేగా గెలవలేని పవన్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. సినిమా పిచ్చి ఉన్నవాళ్లే పవన్ మీటింగ్లకు వస్తున్నారని వ్యాఖ్యానించారు.

నాడు శాసనం అన్నారు..ఏమైంది
వైసీపీకి 45 సీట్లు వస్తాయంటే.. మిగిలిన 130 జనసేనకు వస్తాయా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల సమయంలో ఇలాంటి సర్వేలే నమ్ముకుని గతంలో జగన్ మోహన్ రెడ్డి సీఎం కాడు ఇది శాసనం అన్నారని గుర్తు చేసారు. శాసనం అన్న నిన్నే ప్రజలు శాసన సభకి కూడా రానీయని విషయం మర్చిపోయావా అంటూ నిలదీసారు.
175 చోట్ల జనసేనకు క్యాండేట్లు కూడా లేరు...వైయస్ఆర్సీపీని దించి అసెంబ్లీ మీద జనసేన జెండా ఎగరేస్తానంటున్నారని ఎద్దేవా చేసారు. నిన్ను తెలుగు ఇండస్ట్రీ హీరో అని చెప్పుకోడానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలంతా సిగ్గు పడుతున్నారంటూ రోజా కీలక వ్యాఖ్యలు చేసారు. సినిమాల నుంచి వచ్చిన ఎన్టీఆర్ పార్టీ పెట్టి సింగిల్ గా పోటీచేసారని..అదే విధంగా..చిరంజీవి పార్టీ పెట్టి సింగిల్ గా పోటీ చేసారని గుర్తు చేసారు.

చిరంజీవి సొంతంగానే పోటీ చేసారు
అదే రక్తం పంచుకుని పుట్టిన పవన్ పార్టీ పెట్టి, పోటీ చేయడం మానేసి ఇతర పార్టీలకు ఓటేయమని కోరుతున్నారని దుయ్యబట్టారు. బీజేపీ తప్పు చేసినా, టీడీపీ తప్పు చేసినా ప్రశ్నిస్తాను అన్న నువ్వు విభజన చట్టంలో మన ఆస్తులు రాకుంటే ఎందుకు మాట్లాడలేదని నిలదీసారు. 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టి సింగిల్ గా పోటీ చెయ్యాలని పవన్ కు సవాల్ చేసారు.
బస్సుయాత్ర చేస్తానని పవన్.. పాదయాత్ర చేస్తానని లోకేష్ డేట్లు అనౌన్స్ చేసారని గుర్తు చేసారు. లోకేష్ వాయిదా వేయగానే పవన్ కూడా వాయిదా వేయడంతోనే ఇద్దరి మధ్య సంబంధాలు ఏంటో అర్దం అవుతోందన్నారు. ఏరోజైతే లోకేష్ టీడీపీలో అడుగుపెట్టారో ఆ రోజు నుంచే ఆ పార్టీ పతనం అయిపోయిందని రోజా వ్యాఖ్యానించారు.

టీడీపీ రైతు సమస్యల గురించా..
ముఖ్యమంత్రి జగన్ ఎక్కువగా రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు. లక్షా ఇరవై ఏడు వేల కోట్లు కేవలం వ్యవసాయ రంగానికే ఖర్చు పెట్టారని వివరించారు. 83వేల కోట్లు సంక్షేమ పథకాల ద్వారా అందిస్తే 44వేల కోట్లు ధాన్యం సేకరణకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. అభ్యర్ధులే లేని పార్టీ అసెంబ్లీలో జెండా ఎగరేస్తానని పవన్ చెప్పటం చూస్తే నవ్వొస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ గడ్డ జగనన్న అడ్డా అంటూ రోజా చెప్పుకొచ్చారు. చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా రైతులకు చేసింది శూన్యమని రోజా ఆరోపించారు.












Click it and Unblock the Notifications