కొడుకుతోనే జ్యోతులకు చెక్ చెప్పేందుకు మంత్రుల ప్లాన్?
కాకినాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేరిన జ్యోతుల నెహ్రూకు తెలుగుదేశం పార్టీలో ఆశించినట్లుగా మంత్రి పదవి లభిస్తుందా? లేక మరో రకంగా చెక్ చెబుతారా? అనే చర్చ సాగుతోంది. మంత్రి పదవి హామీతోనే జ్యోతుల టిడిపిలో చేరారనే వాదనలు ఉన్నాయి.

భూమా నాగిరెడ్డి, జలీల్ ఖాన్, జ్యోతుల నెహ్రూ.. పలువురు వైసిపి నేతలు మంత్రి పదవి పైన ఆశతోనే సైకిల్ ఎక్కారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందరికీ మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదని తాజాగా తెలుస్తోంది.
ముఖ్యంగా జ్యోతులకు మంత్రి పదవి దక్కకుండా చేసేందుకు మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప పక్కా ప్లాన్ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జ్యోతులకు మంత్రి పదవి లభిస్తే చినరాజప్పకు పదవీ గండం తప్పదని అంటున్నారు.
గతంలో, జ్యోతుల వైసిపిలో ఉన్నప్పుడు అసెంబ్లీ ప్రాంగణంలో చినరాజప్ప మాట్లాడుతూ.. జ్యోతుల టిడిపిలో ఉంటే తనకు మంత్రి పదవి లభించకపోయేదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అదే జ్యోతుల టిడిపిలో చేరడంతో చినరాజప్పకు పదవీ గండం ఉండవచ్చుననే వాదనలు ఉన్నాయి.
జ్యోతులకు మంత్రి పదవి దక్కకుండా చేసేందుకు మంత్రులు ఓ ప్లాన్ చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జ్యోతులకు పదవి రాకుండా చేసేందుకు మంత్రులు జిల్లా పరిషత్ చైర్మన్ రాంబాబును టార్గెట్ చేశారని అంటున్నారు.
ఆయన స్థానంలో జ్యోతుల తనయుడు జ్యోతుల నవీన్ను కూర్చోబెట్టడం ద్వారా, జ్యోతులకు మంత్రి పదవి రాకుండా చెక్ చెప్పవచ్చునని భావిస్తున్నారని అంటున్నారు. ఒకే ఇంట్లో రెండు పదవులకు అధిష్టానం మొగ్గు చూపే అవకాశముండదు. నవీన్ను జెడ్పీ చైర్మన్ పదవిపై కూర్చో పెట్టి, జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి రాకుండా చేయాలని చూస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications