ఆపదలోనే కాదు.. ఆనందంలోనూ నేనున్నా- వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి..!!
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో సంక్రాంతి వేడుకలు రంగరంగ వైభవంగా జరిగాయి. అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శంచుకోవడానికి ఏపీతో పాటు కర్ణాటక, తమిళనాడు భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్నారు. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న వారందరూ కాణిపాకం ఆలయానికి వచ్చారు. నిషేధాజ్ఞలు ఉన్నప్పటికీ- జిల్లాలో జల్లికట్టు పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 12 మంది గాయపడ్డారు.
అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చంద్రగిరి శాసన సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి.. ప్రజలకు సంక్రాంతి కానుకను ఇచ్చారు. తన నియోజకవర్గం పరిధిలోని ప్రజలకు అనూహ్యంగా పండుగ కానుకలను పంపిణీ చేశారు. మొత్తంగా 1,60,000 మందికి కొత్త దుస్తులను పంచి పెట్టారు. చంద్రగిరిలోని ఓ ఫంక్షన్ హాలులో ఈ కార్యక్రమాన్ని చేపట్టారాయన.
లక్షా 60 వేల మందికి పంపిణీ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఎక్కడా తొక్కిసలాట చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు. దశలవారీగా వారిని ఫంక్షన్ హాలుకు పిలిపించారు. ముందుగానే టోకెన్లు, దానికి అనుగుణంగా సమయాన్ని కేటాయించారు. ఆ సమయం ప్రకారమే- వారంతా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా కొత్త దుస్తులను అందుకున్నారు. ఎక్కడా కనీసం తోపులాట కూడా చోటు చేసుకోకుండా కార్యక్రమాన్ని ముగించామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు తెలిపారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫొటోను ముద్రించిన బంగారు- ఎరుపురంగు హ్యాండ్ బ్యాగ్స్ లల్లో కొత్త దుస్తులను పెట్టి ఇచ్చారాయన. లాంగ్ లివ్ అవర్ లీడర్.. నాయకుడా వర్ధిల్లు వెయ్యేళ్లు.. అనే అక్షరాలను ముద్రించారు. ఆపదలోనే కాదు ఆనందంలో కూడా నేనున్నాను అంటూ భరోసా కల్పించడానికే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సంక్రాంతి పర్వదినాన తన నియోజకవర్గ ప్రజలు సంతోషంగా గడపాలన్న ఆలోచనతో ప్రతి ఇంటికి ఓ పెద్ద కొడుకుగా నియోజకవర్గ పరిధిలో నివసించే ఒక లక్షా 60 వేల కుటుంబాలకు బట్టలను పంపిణీ చేశానని పేర్కొన్నారు.