విశాఖ తీరం కోతపై ఎమ్మెల్యే ఘాటు వ్యాఖ్యలు
విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుడం వల్ల విశాఖ తీర ప్రాంతం కోతకు గురైన విషయంపై శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఔటర్ హార్బర్ విస్తరణే సముద్రపు కోతలకు కారణమని ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
హార్బర్ చానల్ కోసం తవ్విన మట్టి, బండరాళ్లను సముద్రం దగ్గరే వదిలేయడంతో అది తీరానికి ముప్పుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీఆర్జెడ్ నిబంధనలను ఇష్టానుసారంగా మార్చుతున్నారని, దీని వల్ల సముద్రతీరంలోని భవనాలకు ముప్పు ఉందని ఆయన తెలిపారు. ఈ సమస్య తీవ్రతను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళతానని ఆయన చెప్పారు.
కాగా, విశాఖపట్నంలో సముద్ర తీరం కోతకు గురవుతూనే ఉంది. శుక్రవారం కురుసుర సబ్మెరైన్ మ్యూజియం వద్ద రక్షణ గోడ ధ్వంసమైంది. హుధుత్ తుఫాన్ సమయంలో మ్యూజియం ప్రాంగణంలోకి నీళ్లు రావడంతో పెద్దఎత్తున ఇసుక మేట వేసింది. ప్రస్తుతం కెరటాల ఉధృతికి ఆ ఇసుక కరిగిపోయి ప్రాంగణంలో ఎక్కువ భాగం దెబ్బతింది. రక్షణ గోడ దాటి ప్రాంగణం లోపల ఇసుక కోతకు గురికావడంతో కురుసుర ఉనికికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని సముద్ర అధ్యయన నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెన్నైకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ) అధికారులు శుక్రవారం విశాఖ చేరుకున్నారు. వారితో కలెక్టర్, విశాఖపట్నం పోర్టు, జివిఎంసి అధికారులు సమావేశమై చర్చించారు. బీచ్ కోతకు గల కారణాలపై అధ్యయనం చేసేందుకు కనీసం సంవత్సరం పడుతుందని ఎన్ఐఓ అధికారులు తేల్చి చెప్పారు. తాత్కాలిక పునరుద్ధరణకు సూచనలు ఇచ్చేందుకు కనీసం ఒక వారం రోజులు కావాలని కోరారు.
ఈ నేపథ్యంలో కోత నివారణకు అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. కాగా విశాఖ తీరాన్ని రక్షించాలంటూ ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం బీచ్రోడ్డులో కళ్లకు గంతలతో నిరసన తెలిపారు.