సీఎం జగన్ -కోటంరెడ్డి మధ్య ఏం జరిగింది : గ్యాప్ మొదలైంది అక్కడేనా..!?
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి - వైసీపీ మధ్య గ్యాప్ ఎక్కడ మొదలైంది. చంద్రబాబును కలిశారా, ఏం జరిగింది.
ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహారం ఇప్పుడు చర్చగా మారింది. వైసీపీకి దూరమైనట్లుగా తనకు తానుగా ప్రకటించుకున్న శ్రీధర్ రెడ్డి టీడీపీలోకి వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, సీఎం జగన్ కు వీర విధేయుడినని చెప్పుకొనే కోటంరెడ్డి వ్యవహారంలో అసలు ఏం జరిగింది. ముఖ్యమంత్రితో గత నెలలో సమావేశమై అంతా ఓకే అని చెప్పిన తరువాత..ఇంత రచ్చకు కారణమేంటి. ఈ అంశాలకు కోటంరెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. అసలు సీఎంతో భేటీ సమయంలో ఏం జరిగిందో వివరించారు. ఆ తరువాత జరిగిన పరిణామాలను చెప్పుకొచ్చారు. చంద్రబాబును కలిసిన వార్తలపైనా కోటంరెడ్డి స్పష్టత ఇచ్చారు.

అసలు గ్యాప్ అక్కడే మొదలైందా...!
ప్రభుత్వం మూడు రాజధానుల పైన కట్టుబడి ఉన్న వేళ..అమరావతి రైతులు న్యాయస్థానం టు దేవస్థానం పాదయాత్ర చేసారు. అమరావతి నుంచి తిరుపతి వరకు నిర్వహించిన పాదయాత్ర కోటంరెడ్డి నియోకవర్గంలోకి ప్రవేశించింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వారిని కలిసారు. వారు జై అమరావతి అని నినదించమని కోరినా..తాను తిరస్కరించానని..వారు విడిది చేసిన చోట ఉన్న సమస్యలు గుర్తించి వారికి మరో చోట ఏర్పాట్లు చేస్తానని చెప్పానని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. ఆ సమయంలో తాను చేసిన వ్యాఖ్యలు..వైసీపీ అధినాయకత్వానికి కోపానికి కారణమయ్యాయని ఆ ఇంటర్వ్యూలో కోటంరెడ్డి చెప్పారు. దీని పైన తనను నాయకత్వం ప్రశ్నించిందని వెల్లడించారు. అక్కడ నుంచే గ్యాప్ మొదలైందని ఆ తరువాత తనకు అర్దమైందని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. కానీ, తన ఫోన్ ట్యాపింగ్ చేసారనే కారణంతోనే మనస్థాపానికి గురైన తాను పార్టీలో కొనసాగేలనని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు.

చంద్రబాబును కలిసారా..
డిసెంబర్ 25న కోటంరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబును కలిసారని వైసీపీ నేతలు ఆరోపించారు. కోటంరెడ్డి తాను చంద్రబాబును కలిసిన అంశం పైన స్పందించారు. నెల రోజుల క్రితం వరకూ తనకు ఏ ఆలోచన లేదని చెబుతున్నారు. తాను నిర్ణయం తీసుకున్న తరువాత తాను ఎవరిని కలిసినా దానిని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్యానించారు. తనకు బాలినేని, పేర్ని, కొడాలి నానిలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని కోటంరెడ్డి చెప్పుకొచ్చారు. ఇప్పటికే కోటంరెడ్డి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసేందుకు చంద్రబాబు నుంచి హామీ పొందారని ప్రచారం సాగుతోంది. టీడీపీ అధికారంలోకి వస్తే కోటంరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారంటూ మాజీ మంత్రులు చెబుతున్నారు. తాజాగా గన్ మెన్ల విషయంలోనూ కోటంరెడ్డి ప్రభుత్వం ఇద్దరు గన్ మెన్లను తగ్గిస్తే.. మిగిలిన ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు వెల్లడించారు.

కోటంరెడ్డి ఏం చేయబోతున్నారు..
ఇప్పుడు కోటంరెడ్డి రాజకీయంగా వేయనున్న అడుగుల పైన ఆసక్తి పెరుగుతోంది. ఎన్నికలకు ఇంకా 15 నెలల సమయం ఉంది. ఎన్నికల సమయంలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో అంటూ ఆసక్తి కర వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ ఇప్పటికే నెల్లూరు రూరల్ ఇంఛార్జ్ గా ఎంపీ ఆదాలకు బాధ్యతలు అప్పగించింది. నెల్లూరు కార్పోరేటర్లు కొందరు కోటంరెడ్డితో విభేదించారు. కార్పోరేటర్ విజయ్ భాస్కర్ రెడ్డి తనను కోటంరెడ్డి కిడ్నాప్ కు ప్రయత్నించారంటూ కేసు నమోదు చేసారు. అటు టీడీపీ నేతలు కోటంరెడ్డికి టీడీపీ సీటు పైన స్పందిస్తున్నారు. ఎవరికి వారు అభ్యర్దులుగా ప్రకటించుకోవటం సరి కాదని సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డిని అనుసరించేది ఎవరు.. విభేదించేది ఎవరనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఇక.. ఈ నియోజకవర్గంలో వైసీపీ నాయకత్వం ఎటువంటి కార్యచరణ అమలు చేస్తుందనేది ఉత్కంఠను పెంచుతోంది.












Click it and Unblock the Notifications