బెట్టింగ్ రెడ్డి- నారా లోకేష్కు సరైనోడు తగిలాడుగా..!!
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణలపై ప్రొద్దుటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలపై సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు.
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్..తన పాదయాత్ర సందర్భంగా చేస్తోన్న విమర్శలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజాను జబర్దస్త్ ఆంటీ అంటూ ఆయన సంబోధించడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. మంత్రులు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు. నారా లోకేష్ పై మూకుమ్మడి దాడికి దిగుతున్నారు.

బెట్టింగ్ రెడ్డి..
తాజాగా ప్రొద్దుటూరుకు చెందిన వైఎస్ఆర్సీపీ శాసన సభ్యుడు రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డిపై నారా లోకేష్ చేసిన విమర్శలు కూడా అదే రేంజ్ లో కలకలం పుట్టిస్తోన్నాయి. రాచమల్లును బెట్టింగ్ రెడ్డి అంటూ సంబోధించారు నారా లోకేష్. క్రికెట్ బెట్టింగ్లను రాచమల్లు నిర్వహిస్తుంటాడని, ఇసుక దోపిడీకి పాల్పడుతుంటాడంటూ ఆరోపించారు. కడప జిల్లాలో అనేక అసాంఘిక కార్యక్రమాలకు ఆయనే కేంద్రబిందువంటూ ఆరోపించారు.

సీబీఐ విచారణకు..
నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఘాటుగా స్పందించారు. నారా లోకేష్ తనపై చేసిన ఆరోపణలన్నింటిపైనా సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. డిమాండ్ చేయడం వరకే ఆగిపోలేదాయన. ప్రొద్దుటూరు నుంచి విశాఖపట్నానికి వచ్చారు. సుమారు 800 కిలోమీటర్లు ట్రావెల్ చేశారు. విశాఖపట్నంలో సీబీఐ అధికారులను కలిశారు. వారికి వినతిపత్రాన్ని అందజేశారు. నారా లోకేష్, ఆయన అనుచరులు తనపై చేస్తోన్న ఆరోపణలన్నింటిపైనా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

సవాల్ విసిరింది లోకేషే..
తనపై చేసిన ఆరోపణలన్నింటిపైనా సీబీఐ విచారణ కోరే దమ్ము రాచమల్లుకు ఉందా? అంటూ నారా లోకేష్ చేసిన సవాల్ ను స్వీకరించారాయన. సీబీఐ విచారణకు నారా లోకేషే డిమాండ్ చేశారని, దాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత తనపై ఉందని రాచమల్లు అన్నారు. తన సచ్ఛీలతను నిరూపించాలని సీబీఐని కోరుతున్నానని చెప్పారు. సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన నారా లోకేష్.. ఇప్పుడు వెనుకంజ వేయడనే తాను అనుకుంటున్నానని, ఆయన కూడా ముందుకు రావాలని ప్రతి సవాల్ విసిరారు.

పరువు నష్టం దావా కూడా..
తన పరువుకు భంగం కలిగేలా ఆరోపణలు చేసిన నారా లోకేష్ పై కోర్టులో కేసు కూడా వేయబోతోన్నట్లు రాచమల్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు వ్యవస్థపై నారా లోకేష్ కు నమ్మకం లేదని, అందుకే తాను సీబీఐ విచారణ కోరానని వివరించారు. ఇప్పటికిప్పుడు జగన్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం, చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడం అనేదే టీడీపీ నాయకుల లక్ష్యమని ఆరోపించారు. గతంలో చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణను కోరే దమ్ము నారా లోకేష్ కు ఉందా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications