ఎమ్మెల్యే రోజాకు చేదు అనుభవం.. సొంత నియోజకవర్గంలో అడ్డగింత.. వైసీపీ నేతల పనే..
వైఎస్సార్సీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజా.. ప్రతిపక్ష పార్టీలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తారు. సామాజిక సమీకరణాల కారణంగా మంత్రి దక్కకపోవడంతో సీఎం జగన్ ఆమెను ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) చైర్ పర్సన్ గా నామినేట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ను పక్కన పెడితే.. సొంత నియోజకవర్గంలో మాత్రం ఆమెపై వ్యతిరేకత వ్యక్తమవుతుండటం.. సొంత పార్టీ నేతలే ఆమెకు చుక్కలు చూపిస్తుండటం చర్చనీయాంశమైంది.
ఎమ్మెల్యేను రానీయకుండా..
మాజీ సినీ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణికి సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. కొత్తగా నిర్మించిన గ్రామ సచివాలయం భవనాల్ని ప్రారంభించేందుకు ఆమె ఆదివారం నగరికి వచ్చారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ నేతలు అట్టహాసంగా ఏర్పాట్లు కూడా చేశారు. కానీ తీరా ఎమ్మెల్యేను కార్యక్రమంలో పాల్గొననీయకుండా సొంత పార్టీనేతలే అడ్డుకునే ప్రయత్నం చేశారు.
వద్దన్నా వినలేదు..
సొంత నియోజకవర్గంలో.. సొంత పార్టీ నేతలే అడ్డుకోవడంతో నగరి ఎమ్మెల్యే రోజా ఒకింత అసహనానికి లోనయ్యారు. ఆందోళన వద్దంటూ నేతలను సముదాయించే ప్రయత్నం చేశారు. అయినాకూడా పార్టీ నేతలు ఎమ్మెల్యే మాట వినిపించుకోకుండా నినాదాలు చేశారు. దీంతో నిర్వాహకులు గ్రామ సచివాలయం ప్రారంభోత్సవకార్యక్రమాన్ని హడావిడిగా కానిచ్చేశారు.
గోడు వెళ్లగక్కిన వైసీపీ నేతలు..
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి, జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ప్రతిపక్ష టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా జగన్ కు మద్దతుపలుకుతుండటం తెలిసిందే. ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే టీడీపీకి చెందిన కీలక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వైసీపీలోకి జంప్ అయ్యారు. ప్రస్తుతం పార్టీలో టీడీపీ నుంచి వచ్చినవాళ్లకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని, ఎన్నో ఏండ్లుగా పార్టీనే నమ్ముకున్న తమను చిన్నచూపు చూస్తున్నారని వైసీపీ నేతలు గోడు వెళ్లబోసుకున్నారు. తమ బాధను వ్యక్తం చేయడానికే ఎమ్మెల్యే రోజాను అడ్డుకున్నామని పార్టీ నేతలు చెప్పారు.