ఫిల్మ్ నగర్ ఎఫెక్ట్: గంటాపై ఎమ్మెల్యేల తిరుగుబాటు, చంద్రబాబుకు ఫిర్యాదు
విశాఖ: మంత్రి గంటా శ్రీనివాస రావు పైన ఎమ్మెల్యేలు తిరుగుబావుటా ఎగురవేశారా? అంటే అవుననే అంటున్నారు. మంగళవారం నాడు సర్క్యూట్ హౌస్లో పలువురు ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. ఫిలిం నగర్ సొసైటీకి భూ కేటాయింపుల పైన గరంగరంగా ఉన్నారు.
ఫిలిం నగర్ సొసైటీకి భూకేటాయింపులు చేస్తే తొట్లకొండ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి విఘాతం కలుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్ కేంద్రంగా ఫిలిం నగర్ సొసైటీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. విశాఖలో విస్తరించేందుకు భూముల కేటాయింపు విషయమై ఓ నిర్మాత ఒత్తిడితో మంత్రి గంటా మంత్రాంగం నడిపినట్లుగా తెలుస్తోందని సాక్షి దినపత్రికలో కథనం వచ్చింది.
ఫిలిం నగర్ సొసైటీకి భూముల కేటాయింపు పైన చక్రం తిప్పారని, వారంలోనే దస్త్రం సిద్ధమైందని పేర్కొంది. ఈ కారణంగా కాపులుప్పాడలో మంగమారిపేట పక్కనే తొట్లకొండను ఆనుకొని ఉన్న 17 ఎకరాలను ఫిలిం నగర్ సొసైటీకి ఇచ్చారని, ఇక్కడ గజం రూ.10వేల నుంచి అంతకు మించి పలుకుతోందని పేర్కొంది.
17 ఎకరాల భూమి మార్కెట్ విలువ రూ.100 కోట్లు ఉందని, ఈ భూములను ప్రభుత్వం రూ.4,638కి నిర్ణయించారని తెలుస్తోందని పేర్కొంది.
విలువైన భూమిని సంప్రదింపులు జరపకుండా మంత్రి గంటా ఒత్తిడితో సొసైటీ పరం చేశారని ఆరోపిస్తున్నారని పేర్కొంది. ఇక్కడ ఫిలిం నగర్ పెద్దలు భూమి పూజ కూడా చేశారు. అయితే, భూముల కేటాయింపు పైన ఇటు జిల్లా ఎమ్మెల్యేలు, అటు విశాఖ ఎంపీ హరిబాబు కూడా గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తోందని పేర్కొంది.
ప్రోటోకాల్ వివాదం
ఫిలిం నగర్ సొసైటీకి భూముల కేటాయింపు నేపథ్యంలో సమావేశమైన స్థానిక ఎమ్మెల్యేలు.. అధికారుల తీరు పైన అసహనం వ్యక్తం చేశారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని, కానీ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రానికి విఘాతం సరికాదని అంటున్నారు. ఈ నెల 21 ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారుల తీరుపై ఆయనకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.