ముందస్తుగా ఎన్నికలు వస్తాయని ఒక జడ్జి ఎలా వ్యాఖ్యానిస్తారు - మాణిక్య వర ప్రసాద్..!!
ఇటీవల కోర్టుల్లో చేస్తున్న వ్యాఖ్యానాలను కొందరు వక్రీకరిస్తున్నారని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. న్యాయ వ్యవస్థ పైన జగన్ కు గౌరవం ఉందని చెప్పారు. తీర్పు ఇస్తే అమలు చేస్తామని.. విభేదిస్తే అప్పీల్ కు వెళ్తామని చెప్పుకొచ్చారు. కోర్టులు కూడా తమ పరిధిలో లేని అంశాలను ప్రస్తావించడం వల్ల, వాటిని కొన్ని పత్రికలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ప్రచురిస్తున్నాయని వివరించారు. తమ ప్రభుత్వానికి..ముఖ్యమంత్రికి న్యాయస్థానాలంటే గౌరవం ఉందని..అనేక సందర్భాల్లో మాకు ఇబ్బందికర పరిస్థితులు వచ్చినా, పూర్తి సంయమనం పాటిస్తున్నామని చెప్పుకొచ్చారు.
తాజాగా ఒక న్యాయమూర్తి ఒక సందర్భంలో ఎన్నికలు తొందరగా వస్తాయని వ్యాఖ్యానించిన అంశాన్ని డొక్క ప్రస్తావించారు. దీనికి అడ్వకేట్ జనరల్ న్యాయస్థానానికి స్పష్టత ఇచ్చారన్నారు. ఎన్నికలు కాల పరిమితి మేరకు జరగుతాయని కోర్టుకు నివేదించారని చెప్పారు. ఆ జడ్జి అలా ఎందుకు అన్నారో తమకు అర్దం కావటం లేదన్నారు. పొలిటికల్ కనెక్టివిడీ ఉన్న విషయాలు అక్కడ ప్రస్తావించడంతో, కొన్ని పత్రికలు, కొన్ని సంస్థలు తమకు అనుకూలంగా వాడుకుంటున్నాయని చెప్పుకొచ్చారు.భవిష్యత్తులో అలాంటివి జరగకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. జడ్జీల వ్యాఖ్యలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇటీవల ఒక న్యాయమూర్తి తమ కుమార్తె ఏపీ రాజధాని ఎక్కద ఉందని అడిగిన విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేసారు. నిజానికి రాజధాని అంశం హైకోర్టు విచారణ పరిధిలో ఉంది. సుప్రీంకోర్టులోనూ వ్యాజ్యం కొనసాగుతోంది. మీరు దానిపై విచారణ చేస్తూ, ఆ విధంగా కామెంట్స్ చేయొచ్చా అని డొక్కా ప్రశ్నించారు. కోర్టుల్లో వ్యాఖ్యానాలను, రాజకీయ పక్షాలు తమకు అనుకూలంగా వాడుకోవడం సరికాదని, అలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదని సాక్షాత్తూ మాజీ రాష్ట్రపతితో పాటు, సుప్రీంకోర్టు కూడా కోరిందని డొక్కా గుర్తు చేసారు. తమకు న్యాయవ్యవస్థ మీద, ఆ జడ్జీ మీద చాలా గౌరవం ఉందన్నారు. ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని కోరుతున్నామని డొక్కా పేర్కొన్నారు.