రూ.5,700 కోట్లతో మోదీ కొత్త కేబినెట్లో టీడీపీ ఎంపీ నయా రికార్డ్
Pemmasani Chandra Sekhar: డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. ఏపీకి చెందిన ప్రవాసాంధ్రుడు. తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ కూటమికి చెందిన లోక్సభ సభ్యుడు. మొన్నటి ఎన్నికల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన గుంటూరు లోక్సభ నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించిన అభ్యర్థి. పోటీ చేసిన తొలి ఎన్నికలోనే తిరుగులేని మెజారిటీతో విజయబావుటా ఎగురవేశారు.
గుంటూరు లోక్సభ నుంచి టీడీపీ కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన ఈ ఎన్నారై.. సుమారు 3.50 లక్షల ఓట్ల తేడాతో తన సమీప ప్రత్యర్థి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కిలారి వెంకట రోశయ్యపై విజయం సాధించారు. తెలుగుదేశం కూడా ఈ స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇక్కడి నుంచి వరుసగా మూడోసారి గెలిచింది.

పెమ్మసాని చంద్రశేఖర్కు కేంద్ర కేబినెట్లోనూ చోటు దక్కించుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి రెండు బెర్త్లను కేటాయించింది బీజేపీ. పెమ్మసానితో పాటు, శ్రీకాకుళం లోక్సభ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడుకూ చోటు లభించింది. ఈ మేరకు వారిద్దరూ కూడా ఢిల్లీలో నరేంద్ర మోదీ నివాసంలో ఏర్పాటైన సమావేశానికి హాజరయ్యారు.
కాగా- మోదీ కొత్త కేబినెట్లో అత్యంత ధనవంతుడిగా రికార్డు సృష్టించనున్నారు పెమ్మసాని చంద్రశేఖర్. ఆయన ఆస్తుల విలువ 5,700 కోట్ల రూపాయలు. ఈ మేరకు తన ఎన్నికల డిక్లరేషన్లో వాటిని పొందుపరిచిన విషయం తెలిసిందే. కొత్త కేబినెట్ మంత్రులందరిలోకెల్లా ఆయనే రిచ్చెస్ట్ కానున్నారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత.
వృత్తిరీత్యా ఆయన డాక్టర్. 1993-94 ఎంసెట్ పరీక్షల్లో మెడిసిన్లో 27వ ర్యాంక్ సాధించారు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెడిసిన్ పూర్తి చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. పెన్సిల్వేనియాలో గల గీసింగర్ మెడికల్ సెంటర్లో ఎండీ చేశారు. తాజాగా రాజకీయాల్లో అరంగేట్రం చేశారు.












Click it and Unblock the Notifications