జగన్-కేసీఆర్ కు చంద్రబాబు-రేవంత్ ఇవ్వబోతున్న మెసేజ్ ఇదేనా?
ఏపీలో తాజా ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి అందిన అధికారిక ఆహ్వానం మేరకు సీఎం చంద్రబాబు ఇవాళ హైదరాబాద్ లో ఆయనతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్ వెళ్లి రేవంత్ రెడ్డితో భేటీ అవుతారు. అయితే ఈ భేటీలో ప్రధానంగా విభజన సమస్యలపైనే చర్చ జరగనుండగా, పలు ఇతర అంశాలూ చర్చించనున్నారు. దీంతో ఈ భేటీ ద్వారా తమ ప్రత్యర్థులు కేసీఆర్-జగన్ కు ఓ పొలిటికల్ సంకేతం ఇచ్చేందుకు చంద్రబాబు-రేవంత్ ప్రయత్నిస్తున్నారు.
ఏపీ విభజన తర్వాత కొంతకాలం హైదరాబాద్ లోనే ఉన్న చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వివాదం తర్వాత కేసీఆర్ తో రాజీ చేసుకుని అమరావతికి వచ్చేశారు. ఆ తర్వాత 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబుకు చేదు ఫలితాలు ఎదురయ్యాయి. దీంతో 2023 ఎన్నికల్లో తిరిగి ఆ సాహసం చేయలేకపోయారు. దీంతో పాటు తెలంగాణలో టీడీపీని ఉనికిలేకుండా చేసిన కేసీఆర్ పై చంద్రబాబు కోపం అలాగే ఉంది. అదే సమయంలో చంద్రబాబును ఒకట్రెండు సందర్భాల్లో పొగిడిన బీఆర్ఎస్ నేతలు.. ఏపీలో ఆయన అరెస్టు అయినప్పుడు హైదరాబాద్ లో నిరసనలకు అనుమతివ్వలేదు.

ఇటు ఏపీలో చంద్రబాబు, జగన్ కు ఉన్న వైరం 2014 ఎన్నికలకే పతాకస్ధాయిలో ఉంది. అప్పటికే కాంగ్రెస్ ను విభేదించి వైసీపీ పేరుతో వేరు కుంపటి పెట్టుకున్న జగన్ ను కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జైలుకు పంపాయన్న మెసేజ్ జనాల్లోకి పంపడంలో జగన్ సక్సెస్ అయ్యారు. దీంతో 2014 నాటికి 67 సీట్లు గెల్చుకున్న జగన్ ఆ తర్వాత 2019కి ఏకంగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. దీంతో పాటు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు. ఈసారి మాత్రం టీడీపీ కూటమి గెలుపుతో జగన్ 11 సీట్లకే పరిమితం అయ్యారు. జనం తాజా తీర్పుతో చంద్రబాబుతో పోటీ పడే పరిస్ధితి జగన్ కు లేకుండా పోయింది.
మరోవైపు కేసీఆర్ పై పదేళ్లుగా టీడీపీ, కాంగ్రెస్ తరఫున పోరాటాలు చేస్తున్న రేవంత్ రెడ్డిని.. మధ్యలో బీఆర్ఎస్ ప్రభుత్వం జైలుకు కూడా పంపింది. ఆ తర్వాత జనంలో ఆయన ఇమేజ్ బాగా పెరిగింది. చివరకు తెలంగాణలో గతేడాది అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేసే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు చంద్రబాబును వ్యతిరేకించే కేసీఆర్ 2019 ఎన్నికల్లో జగన్ కు పూర్తిగా సహకరించారు. దీంతో మొదట్లో కలిసే కనిపించిన కేసీఆర్-జగన్ ఆ తర్వాత ఎవరి పనిలో వారు ఉండిపోయారు. అయినా వీరిద్దరూ చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరికీ ఉమ్మడి ప్రత్యర్ధులుగానే ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఇవాళ హైదరాబాద్ లో చంద్రబాబు-రేవంత్ రెడ్డి భేటీ కానుండటంతో తిరిగి జనానికి కొత్త మెసేజ్ ఇచ్చేందుకు వీరిద్దరూ ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో వీరి ఉమ్మడి ప్రత్యర్థులు అయిన కేసీఆర్-జగన్ కు పొలిటికల్ గా తాము ఏ స్ధాయిలో ఉన్నామో చెప్పేందుకు చంద్రబాబు-రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఒకప్పటి చంద్రబాబు శిష్యుడైన రేవంత్ రెడ్డి తాను అధికారంలోకి వచ్చే వరకూ సైలెంట్ గా ఉండి ఆ తర్వాత క్రమంగా ఆయనకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా తెలుగు రాష్ట్రాలకు ఇక తామే గతి అన్న సందేశం కేసీఆర్-జగన్ కు పంపబోతున్నారు. రాబోయే ఐదేళ్లలో తాము కలిసి పనిచేయడం ద్వారా కేసీఆర్-జగన్ కు ఊపిరాడకుండా చేయాలనే పట్టుదలతో వీరు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications