"జగన్ చిన్నపిల్లాడు.. వద్దన్నారు: సీఎం పదవిపై అప్పట్లో ఆయన మాట"
ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రి పదవి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా నాడు తీవ్రం గా వ్యతిరేకించారని జగన్నాథం అన్నారు.
హైదరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎం కావడానికి విఫలయత్నం చేశారని చెబుతారు. పార్టీ హైకమాండ్ సహా సీనియర్లు అందుకు ఒప్పుకోకపోవడంతో అప్పట్లో ఆయనకు సీఎం పదవి దక్కలేదన్న ప్రచారం ఉంది.
ఆ నేపథ్యంలోనే జగన్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంత కుంపటి పెట్టుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్.. 2019లో అయినా అధికారాన్ని చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్నారు. ఇలాంటి తరుణంలో.. ఆనాటి పరిస్థితులపై తెలంగాణకు చెందిన మాజీ ఎంపీ మందా జగన్నాథం ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రి పదవి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ వోరా నాడు తీవ్రం గా వ్యతిరేకించారని జగన్నాథం అన్నారు. వైఎస్ మరణం తర్వాత జగన్ సీఎం పదవి కోసం తీవ్రంగానే ప్రయత్నించారని పేర్కొన్నారు. అప్పటి పరిస్థితుల్లో తాను, సర్వే సత్యనారాయణ, నంది ఎల్లయ్య తదితర ఎంపీలంతా కలిసి మోతీలాల్ వోరాను కలిసినట్టు చెప్పారు.
ఆ సమయంలో మోతీలాల్ వోరా 'జగన్ చిన్నపిల్లాడు. ఇంకా రాజకీయ అనుభవం సాధించాల్సి ఉ:ది. అడిగిన వెంటనే సీఎం పదవి ఇచ్చేందుకు ఇదేమైనా ఆకాశం నుంచి ఊడిపడిందా?' అని పేర్కొన్నారట. అలా జగన్ సీఎం ప్రయత్నాలకు మోతీలాల్ వోరా బ్రేక్ వేశారని మందా జగన్నాథం గుర్తుచేసుకున్నారు.