ఏపీ బీజేపీ ఇంఛార్జ్ గా బండి సంజయ్ - పవన్ లక్ష్యం నెరవేరేనా, బిగ్ టాస్క్..!?
ఏపీ కేంద్రంగా బీజేపీ కొత్త రాజకీయం మొదలు పెట్టింది. ఏపీ బీజేపీలో కీలక మార్పులు చేస్తోంది. పార్టీ అధ్యక్షురాలిగా పురందేశ్వరికి బాధ్యతలు అప్పగించిన హైకమాండ్ మరి కొన్ని నిర్ణయాలు తీసుకుంటోంది. సత్యకుమార్ ను పార్టీ కార్యదర్శిగా కొనసాగించాలని నిర్ణయించింది. ఏపీ ఇంఛార్జ్ బాధ్యతల నుంచి సునీల్ దియోథర్ ను తప్పించింది. ఆ స్థానంలో బండి సంజయ్ కు బాధ్యతలు కేటాయిస్తుందని సమాచారం. ఈ ప్రతిపాదన కొత్త చర్చకు కారణమవుతోంది.
తెలుగు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్
వచ్చే ఎన్నికలకు బీజేపీ తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా పార్టీ జాతీయ కార్యవర్గంలో కొత్త మార్పులు చేసింది. తెలుగు రాష్ట్రాల పైన ఫోకస్ చేసింది. తెలంగాణ, ఏపీ అధ్యక్షులను మార్చిన బీజేపీ హైకమాండ్ ఎన్నికల ఇంఛార్జ్ లను నియమిస్తోంది. తెలంగాణలో ముందుగా ఎన్నికలు జరగనుండటంతో అక్కడ ముఖ్మ నేతలకు పార్టీ రంగంలోకి దించింది.

పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా పని చేసిన బండి సంజయ్ తొలిగింపు పైన పార్టీలోనే వ్యతిరేకత వచ్చింది. దీంతో ఇప్పుడు బండి సంజయ్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి కేటాయించారు. తెలంగాణతో పాటుగా ఏపీ బాధ్యతలను బండి సంజయ్ కు కేటాయించే అవకాశం ఉందని పార్టీ ముఖ్య నేతల సమాచారం.
ఏపీ ఇంఛార్జ్ గా బండి..?
అయిదేళ్లుగా ఏపీ బీజేపీ ఇంఛార్జ్ గా పని చేసిన సునీల్ దేవధర్ ను బీజేపీ పక్కన పెట్టింది. 2018లో రాష్ట్ర సహ ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. ఆయన పని తీరు పైన పార్టీ శ్రేణుల్లోనూ వ్యతిరేకత ఉంది. ఇప్పుడు చేస్తున్న మార్పుల్లో భాగంగా ఏపీకి కొత్త ఇంఛార్జ్ ను నియమించే అంశం పైన చర్చ సాగుతోంది.
అందులో భాగంగా తెలంగాణలో పార్టీలో జోష్ పెంచిన బండి సంజయ్ కు రెండు తెలుగు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించే విధంగా నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. పార్టీ జాతీయ నేతగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైర్ బ్రాండ్ బండి సంజయ్ సేవలు వినియోగించుకొనే విధంగా నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి.
పొత్తు రాజకీయం వేళ కీలకంగా
ఏపీలో బీజేపీ, జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. గతంలో సోము వీర్రాజు తీరు పైన పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ తో మాట్లాడారు. త్వరలోనే పవన్ - పురందేశ్వరి భేటీ జరగనుంది. పురందేశ్వరి బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు.
ఇటు టీడీపీని కలుపుకొని వెళ్లాలనే ఆలోచనలో పవన్ ఉన్నారు. దీని పైన బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తెలంగాణలో పవన్ తో కలిసి బీజేపీ కార్యక్రమాల నిర్వహణను ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ అప్పట్లో వ్యతిరేకించారు. అదే విధంగా టీడీపీతో పొత్తుకు ససేమిరా అంటూ హైకమాండ్ కు నివేదికలు ఇచ్చారు. ఇప్పుడు పొత్తుల రాజకీయం వేళ..బండి సంజయ్ కు ఏపీ ఇంఛార్జ్ గా బాధ్యతలు అప్పగిస్తే కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications