సనాతనం పేరుతో తిరుపతిని ఏం చేయాలనుకున్నారు: అత్యధిక మద్యం షాపులు
AP liquor policy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రకటించిన కొత్త మద్య విధానం, దుకాణాల కేటాయింపు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.
ప్రత్యేకించి- తిరుపతి జిల్లాకు అత్యధికంగా మద్యం దుకాణాలను కేటాయించడం పట్ల దుమారం చెలరేగుతోంది. రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోల్చుకుంటే ఒక్క తిరుపతి జిల్లాకు అత్యధికంగా 227 మద్యం షాపులను కేటాయించింది చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం.

శ్రీకాకుళం- 158, విజయనగరం- 153, పార్వతీపురం మన్యం- 52, అల్లూరి సీతారామరాజు- 40, విశాఖపట్నం- 155, అనకాపల్లి- 136, కాకినాడ- 155, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ- 133, తూర్పు గోదావరి- 125, పశ్చిమ గోదావరి- 175, ఏలూరు- 144 మద్యం దుకాణాలను కేటాయించింది.
కృష్ణా- 123, ఎన్టీఆర్- 113, గుంటూరు- 127, బాపట్ల- 117, పల్నాడు- 129, ప్రకాశం- 171, నెల్లూరు- 182, కర్నూలు- 99, నంద్యాల- 105, అనంతపురం- 136, శ్రీసత్యసాయి పుట్టపర్తి- 87, కడప- 139, అన్నమయ్య రాయచోటి- 111, చిత్తూరు- 104 మద్యం షాపులు దక్కనున్నాయి.
ఆయా జిల్లాలన్నింట్లో పోల్చుకుంటే ఒక్క తిరుపతికే అత్యధికంగా ఏకంగా 227 మద్యం దుకాణాలను కేటాయించింది ప్రభుత్వం. ఆధ్యాత్మిక నగరి, టెంపుల్ సిటీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తిరుపతి జిల్లాకు ఇంత భారీ సంఖ్యలో, ఏ జిల్లాకు కూడా లేనివిధంగా మద్యం దుకాణాలను కేటాయించడం విమర్శలకు దారి తీస్తోంది.
దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరుపతి లోక్సభ సభ్యుడు డాక్టర్ మద్దిల గురుమూర్తి స్పందించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తీరును తప్పుపట్టారు. ఒకవంక సనాతన ధర్మం, తిరుమల తిరుపతి పవిత్రత అని చెప్పుకొంటూ మరోవంక- ఒక్క తిరుపతి జిల్లాకే ఇంత భారీగా మద్యం దుకాణాలను కేటాయించడం సరికాదని అన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడటం అంటే ఎక్కువ మద్యం షాపులను కేటాయించడం కాదని చురకలు అంటించారు.












Click it and Unblock the Notifications