ఆ మార్గంలో రైలును పునరుద్ధరించాలి: రైల్వే బోర్డ్ చీఫ్తో కేశినేని
Kesineni Nani: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని.. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నారు. తన లోక్సభ సభ్యత్వానికి నాని రాజీనామా చేసినప్పటికీ.. అదింకా స్పీకర్ ఆమోదం పొందలేదు.
ఎంపీ హోదాలో రైల్వే బోర్డు ఛైర్పర్సన్ జయా వర్మ సిన్హాతో భేటీ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సామినేని ప్రసాద్తో కలిసి రైల్వే బోర్డ్ కార్యాలయానికి వెళ్లారు. ఛైర్పర్సన్ జయావర్మను కలిశారు. రైల్వే పెండింగ్ పనులపై వినతిపత్రాన్ని అందజేశారు.

విజయవాడ- గుడివాడ లైన్లో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, విజయవాడ నార్త్ క్యాబిన్, గుణదల స్టేషన్లల్లో అదనపు సౌకర్యాలు కల్పించాల్పిన అవసరం ఉందని అన్నారు. సింగ్ నగర్- రామకృష్ణాపురం మధ్య విజయవాడ- హౌరా రైల్వేట్రాక్పై నిర్మించిన రోడ్ అండర్ బ్రిడ్జి విస్తీర్ణాన్ని పెంచాలని విజ్ఞప్తి చేశారు.
విజయవాడ రాజరాజేశ్వరిపేటలో 8.85 ఎకరాల రైల్వే స్థలంలో 30 సంవత్సరాలుగా సుమారు 800 కుటుంబాలు నివసిస్తోన్నాయని, వారిని అక్కడే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి బదులుగా అజిత్ సింగ్ నగర్ వద్ద ప్రత్యామ్నాయ స్థలాన్ని రైల్వేకు కేటాయించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని గుర్తు చేశారు.
రాయనపాడు, ఈలప్రోలు, కొండపల్లి వద్ద మూడు రోడ్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం పెండింగ్లో ఉందని, దీన్ని వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద జగ్గయ్యపేట రైల్వే స్టేషన్ను ఆధునికీకరించాలని, కొత్త స్టేషన్ బిల్డింగ్, హైలెవెల్ ప్యాసింజర్ ప్లాట్ఫామ్స్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
మోటుమర్రి- విష్ణుపురం మధ్య పాసింజర్ రైలును పునరుద్ధరించాలని కేశినేని నాని విజ్ఞప్తి చేశారు. ఈ మార్గంలో పేదలు, దిగువ మధ్య తరగతి కుటుంబీకులకు తక్కువ ప్రయాణ ఖర్చుతో ప్యాసింజర్ రైలును ప్రవేశపెట్టాలని అన్నారు. జన్పహాడ్-మఠంపల్లి మధ్య ఆపరేషన్ ఆఫ్ కోచింగ్ ట్రాఫిక్ను ఏర్పాటు చేయాలని కోరారు.












Click it and Unblock the Notifications