జగన్ ఆదేశం: 'ఆనం'తో మేకపాటి పావులు, బలమున్నా టిడిపిలో భయం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం వరకు ఆనం, నేదురుమల్లి, నల్లపురెడ్డి కుటుంబాలు కేంద్రంగారాజకీయాలు నడిచేవి.
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కొద్ది రోజుల క్రితం వరకు ఆనం, నేదురుమల్లి, నల్లపురెడ్డి కుటుంబాలు కేంద్రంగారాజకీయాలు నడిచేవి. ఇప్పుడు ఆనం, నల్లపురెడ్డి కుటుంబాల ప్రాధాన్యత కనిపిస్తున్నప్పటికీ.. ప్రధానంగా వైసిపి నేత మేకపాటి హవా నడుస్తోంది.
ఆర్థిక ఇబ్బంది.. భారంమీద వేసుకున్న జగన్, తెరపైకి ఆనం: టిడిపిలో హైడ్రామా
ముఖ్యంగా ఆనం, నల్లపురెడ్డి కుటుంబాలకు పట్టులేని జిల్లాలోని పలు ప్రాంతాల్లో తమకు ప్రాబల్యం జారకుండా మేకపాటి కుటుంబం రాజకీయాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం జిల్లాలో వైసిపి పూర్తిగా మేకపాటి వర్గీయుల చేతిలోనే ఉంది.
జగన్ నమ్మకం.. మేకపాటి వ్యూహం
వైయస్ జగన్కు మేకపాటి అంటే అభిమానం, విశ్వాసం. జగన్ తన పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా చూసుకుంటూ జిల్లాలో తమ ప్రాబల్యం మరింత పెంచుకుంటూ పోయేందుకు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహరచన చేస్తున్నారు.
తెరపైకి ఆనం విజయ్ కుమార్
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపికి స్పష్టమైన మెజార్టీ ఉన్నప్పటికీ వైసిపి తరఫున అభ్యర్థి నిలపాలని జగన్ సూచించారు. అయితే తమకు బలం లేనందున వైసిపి నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అలాంటి సమయంలో మేకపాటి వ్యూహాత్మకంగా ఆనం కుటుంబానికి చెందిన ఆనం విజయ కుమార్ రెడ్డిని తెరపైకి తీసుకు వచ్చారు.
బలం ఉన్నా టిడిపికి ఓటమి భయం
ఆనం విజయ్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించినప్పటి నుంచి.. టిడిపికి మెజార్టీ ఉన్నప్పటికీ ఓటమి భయం పట్టుకుందని అంటున్నారు. తొలుత టిడిపి తరఫున వాకాటి నారాయణ రెడ్డి పేరును ప్రకటించాలనుకున్నారు. ఆనం పేరు ప్రకటించగానే టిడిపి మల్లగుల్లాలు పడింది. చివరకు మళ్లీ వాకాటినే ప్రకటించింది.
టిడిపికి మేకపాటి షాక్
మేకపాటి వ్యూహాత్మకంగా పావులు కదిపి ఆనం పేరును తెరపైకి తీసుకు రావడంతో.. బలం ఉన్నప్పటికీ టిడిపి ఆందోళన చెందుతోంది. దీంతో స్వయంగా చంద్రబాబు పర్యవేక్షించవలసి వస్తోంది. ఆనం కుటుంబ సభ్యుడిని రంగంలోకి దింపడం ద్వారా మేకపాటి టిడిపికి షాకిచ్చారని అంటున్నారు. ఆనం గెలుపును మేకపాటి తన మీద వేసుకున్నారు. పైగా, జగన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖర్చుకు సిద్ధమని చెప్పాడని వార్తలు వచ్చాయి.
ఏకతాటిపైకి తెచ్చారు
పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జులు, జెడ్పీ చైర్మన్, పార్టీ సీనియర్ నేతలందరినీ మేకపాటి ఏకతాటిపై తీసుకు వచ్చారు. ఇప్పుడు వైసిపి నేతల్లో ఎలాంటి విభేదాలు కనిపించడం లేదు. అందర్నీ ఏకతాటి పైకి తీసుకు రావడంలోను మేకపాటి ముఖ్యపాత్ర పోషించారని అంటున్నారు.
ఆత్మప్రబోధానుసారం సెంటిమెంట్
అంతేకాదు, తమ పార్టీ నుంచి టిడిపిలోకి వెళ్లిన ఎంపీటిసి, జడ్పిటిసిలను సంప్రదిస్తూ వారు ఎన్నికల్లో వైసిపికి ఓటు వేసేలా వారిని ఒప్పించేందుకు పార్టీ నేతలు, ఆయా ప్రాంతాల్లోని తమ అనుచరుల ద్వారా మేకపాటి ప్రయత్నాలు చేస్తున్నారు. వేరే పార్టీలోకి వెళ్లినప్పటికి బ్యాలెట్ బాక్స్ల ద్వారా జరిగే ఎన్నికలు కావడంతో ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేయాలని చెబుతున్నారు.
మేకపాటి టార్గెట్ 2019
ఖచ్చితంగా నెల్లూరు స్థానం గెలవడం ద్వారా 2019లో జరిగే ఎన్నికల్లో జిల్లాలో వైసిపి అత్యధిక స్థానాల్లో గెలిచేలా ఇప్పట్నుంచే పార్టీ శ్రేణుల్ని ఉత్తేజపరిచే సన్నాహాల్లో మేకపాటి ఉన్నారు.
టిడిపి ఎంపీల కిడ్నాప్
స్థానిక సంస్థల ఎన్నికల వేడి కిడ్నాప్లతో జిల్లాలో తారాస్థాయికి చేరుకుంటోంది. చిట్టమూరు మండలం మల్లాం బిట్-1, బిట్-2 ప్రాంతాలకు చెందిన టిడిపి ఎంపిటిసిలు తిరుమూడు అశోక్, కత్తి చెంగయ్య అనే ఇరువురిని బుధవారం అర్ధరాత్రి వైసిపి నాయకులు ఐదుగురు కిడ్నాప్చేసి, వైసిపి స్థానిక సంస్థల అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఇంట్లో దాచిపెట్టారని చిట్టమూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందాయి.
స్పందించిన పోలీసులు
నెల్లూరు రూరల్ పోలీసులకు ఈ సమాచారం రావడంతో బుధవారం అర్ధరాత్రి ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఇరువురు ఎంపిటిసిలను కిడ్నాప్ చెర నుంచి విడిపించినట్లు పోలీసులు తెలిపారు.