2028లో భారత్ లోకి పాలిమర్ కరెన్సీ..ఆర్బీఐ గవర్నర్ ప్రకటన!
ఇప్పటికే అనేక దేశాలు పాలిమర్ కరెన్సీ వినియోగిస్తున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలో కూడా పాలిమర్ కరెన్సీ వినియోగం పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. భారతదేశంలో 2028 ఆర్ధిక సంవత్సరానికి పాలిమర్ కరెన్సీ నోట్లను చలామణీలోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ద్రవ్య విధాన సమీక్ష తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.
పాలిమర్ నోట్లపై క్షేత్రస్థాయి పరీక్షలు కొనసాగుతున్నాయి: ఆర్బీఐ గవర్నర్
ప్రస్తుతం పాలిమర్ నోట్లపై క్షేత్రస్థాయి పరీక్షలు కొనసాగుతున్నాయని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపారు. మార్కెట్ లోకి తీసుకురాకముందు పాలిమర్ నోట్ల పనితీరును పూర్తిగా పరిశీలిస్తామని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు. పరీక్షల ఫలితాలను విశ్లేషించిన తర్వాత విస్తృతస్థాయిలో చలామణీ చేసే అంశంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల రూ.10, రూ.20 విలువ ఉన్న పాలిమర్ నోట్ల క్షేత్రస్థాయి పరీక్షలకు ఆర్బీఐ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది.

పాలిమర్ నోట్లను నకిలీ చేయటం చాలా కష్టం
పైలెట్ ప్రాజెక్ట్ లో భాగంగా ఒక్కో విలువలో 100కోట్ల నోట్లు విడుదల చేసి అవి ఎంత కాలం మన్నుతాయి, భారత వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉంటాయా అన్నది పరిశీలించనున్నారు. అయితే ప్రస్తుతం మనదేశంలో కాగితపు కరెన్సీ చెల్లుబాటులో ఉంది. సాధారణంగా కాగితపు కరెన్సీతో పోలిస్తే పాలిమర్ కరెన్సీ ఎక్కువ కాలం మన్నుతాయి. వీటిలో ట్రాన్స్పరెంట్ విండోలు, అధునాతనమైన భద్రతా ఫీచర్లు ఉండటం కారణంగా వీటిని నకిలీ చేయటం చాలా కష్టం.
పైలెట్ ప్రాజెక్ట్ పైన ఫోకస్
దీంతో ఫేక్ కరెన్సీ అరికట్టటం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అంతేకాదు ఇవి త్వరగా చిరగవు, తేమ, మురికి అంటుకునే ఇబ్బంది ఉండదు. దీనివలన ప్రభుత్వానికి నోట్లను తరచుగా మార్చాల్సిన అవసరం ఉండదు. దీంతో ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుంది. ఈ క్రమంలో పైలెట్ ప్రాజెక్ట్ పైన ఫోకస్ పెడుతున్నారు. అయితే ప్రస్తుతం పూర్తిగా కాగితం నోట్లు తొలగించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
పాలిమర్ నోట్లు వస్తాయా రావా అన్నది తేలేది పరీక్షల ఫలితాల తర్వాతే
పాలిమర్ నోట్లు ప్రవేశపెడితే అవి ప్రస్తుతం ఉన్న కాగితపు నోట్లతో పాటు చలామణిలోకి వస్తాయని పేర్కొంది. పాలిమర్ నోట్లను మార్కెట్లోకి చలామణిలోకి తీసుకురావడానికి ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్ వంటి దేశాల అనుభవాలను ఆర్బీఐ పరిగణనలోనికి తీసుకుంటుంది. 2028నాటికి పాలిమర్ నోట్లు విస్తృతంగా అందుబాటులోకి వస్తే కరెన్సీ నిర్వహణలో భారత్ లోనూ మరో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న పైలెట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న పరీక్షల ఫలితాల పైన దేశంలో పాలిమర్ నోట్లు వస్తాయా రావా అన్న తుది నిర్ణయం తీసుకోనుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.













Click it and Unblock the Notifications