సీఎం జగన్ కేసులు మరో రాష్ట్రానికి - సుప్రీంకి రఘురామ, రేపే..!!
ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టిలతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ప్రస్తుతం జగన్ అక్రమాస్తుల కేసు విచారణ హైదరాబాద్ సీబీఐ కోర్టులో జరుగుతోంది.
రఘురామ పిటీషన్: సీఎం జగన్ పైన సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకు 3,041 సార్లు వాయిదా పడ్డాయని రఘురామ తన పిటీషన్ లో పేర్కొన్నారు వీటి విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐ లో కనిపించటం లేదని ఆరోపించారు. ఇందులో జగన్ కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేఛ్చను ఇచ్చారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించటం లేదని వివరించారు.

దీంతో, సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వీటి విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. క్రిమనల్ కేసుల విచారణ స్వేచ్చగా, విష్పాక్షికంగా జరగకపోతే న్యాయవ్యవస్థ నిష్పాక్షికత ప్రమాదంలో పడి ప్రజల విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఏర్పడుతుందని తన పిటీషన్ లో పేర్కొన్నారు.
వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి: గతంలో ఇలాంటి పరిస్థితి ఏర్పడిన సమయంలో సీఆర్ఫీసీ సెక్షన్ 406 కింద జయలలిత అక్రమాస్తుల కేసు విచారణ తమిళనాడు నుంచి కర్ణాటక కు బదిలీ చేసారని గుర్తు చేసారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విచారణ న్యాయంగా, నిష్పాక్షికంగా జరగాలని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొందని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం జగన్ పైన కేసుల విచారణలో పురోగతి లేదన్నారు. కనీసం అభియోగాలు కూడా నమోదు చేసకుండానే వందల వాయిదాలు వేసారని వివరించారు. అందువలన ఈ కేసులో ప్రాసిక్యూషన్, న్యాయ ప్రక్రియల నిష్పాక్షికతపై అనుమానాలు తలెత్తడానికి అవకాశం ఏర్పడుతోందని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు కుమ్మక్కు అయినట్లు ప్రజలు భావిస్తున్నారని చెప్పుకొచ్చారు.
రేపే విచారణ: గతంలోసీఎం జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నరని, బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఇందులో సాక్ష్యాలుగా.., అక్రమాస్తుల కేసులో నిందితులుగా ఉన్న వారికి పలు రకాల పదవులు ఇవ్వడం.. ప్రయోజనాలు కల్పించడం వంటివి చేస్తున్నారని కోర్టుకు నివేదించారు.
అయితే ఈ పిటిషన్ ను సీబీఐ కోర్టు కొట్టి వేసింది. తర్వాత ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఈ పిటిషన్ విచాణకు రావడం లేదు. ఇప్పుడు నేరుగా సుప్రీంకోర్టులో జగన్ అక్రమాస్తుల కేసును ఇతర రాష్ట్రానికి తరలించాలని పిటిషన్ వేశారు. ఈ పిటీషన్ రేపు (శుక్రవారం) విచారణకు వస్తుండటంతో కోర్టులో ఏ రకంగా వాదనలు జరుగుతాయి..ఏం జరుగుతుందనే ఉత్కంఠ కొనసాగుతోంది












Click it and Unblock the Notifications