కేసుల నుంచి కడిగిన ముత్యంలా సీఎం జగన్ బయటికి - రఘురామ..!!
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ రాజు దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టి వేసింది. బెయిల్ రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటీషన్ లో పేర్కొన్న కారణాలతో కోర్టు విభేదించింది. తన పిటీషన్ ను కోర్టు కొట్టివేస్తూ తీర్పు ఇవ్వటం పైన రఘురామ స్పందించారు. ఈ తీర్పు తాను ముందే ఊహించానని వ్యాఖ్యానించారు. పది రోజుల్లోనే హైకోర్టు తీర్పు వెలువరిస్తుందని భావించానని, కానీ 10 నెలల ఐదు రోజుల సమయం పట్టిందన్నారు.
కోర్టు తీర్పు వెంటనే వచ్చి ఉంటే తాను సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. న్యాయస్థానం తీర్పును తాను తప్పు పట్టడం లేదని, తన పిటిషన్పై అవతలి వారి వాదనలు వినవలసిన అవసరం లేదని కోర్టు భావించినప్పుడే... తీర్పు ఎలా ఉంటుందో తనకు అర్థమయ్యిందన్నారు. తనకు న్యాయస్థానాలపై గౌరవం ఉన్నదని, ఆలస్యంగానైనా న్యాయం జరుగుతుందని నమ్ముతానని తెలిపారు.
కడిగిన ముత్యంలా జగన్మోహన్రెడ్డి కేసుల నుంచి బయటికి వస్తారని ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ప్రజలు భావించడంలో అతిశయోక్తి లేదన్నారు. తనకు కూడా ఎటువంటి అనుమానం లేదని, ఈ విషయాన్ని గతంలోనే చెప్పానని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ దిశగా వడివడిగా అడుగులు పడుతున్నట్లు స్పష్టం అవుతున్నదన్నారు.

ప్రభుత్వ ఉద్యోగులైన సాక్షులకు పదోన్నతులు కల్పిస్తుండగా, సహ నిందితులకు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వాన్ని కట్టబెట్టారని రఘురా విమర్శించారు. మురళీధర్ రెడ్డిపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదని వివరించారు. తొలుత సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ సీబీఐ కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు.
అక్కడ ఆ పిటీషన్ ను కోర్టు కొట్టవేస్తూ తీర్పు చెప్పింది. దీని పైన తెలంగాణ హైకోర్టులో రఘురామ అప్పీల్ కు వెళ్లారు. విచారణ జరిగిన తరువాత శుక్రవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ, రఘురామ పిటీషన్ ను కొట్టివేసారు. అటు సీఎం జగన్ తరపు న్యాయవాదులు తమ వాదనలను న్యాయస్థానం ముందు వినిపించారు. రాజకీయ కారణాలతోనే ఈ పిటీషన్ దాఖలు చేసారని కోర్టుకు నివేదించారు.












Click it and Unblock the Notifications