దసపల్లా భూములపై విజయసాయిరెడ్డి చెప్పేదేమిటంటే..?
దసపల్లా భూముల వ్యవహారంలో తమ ప్రభుత్వంకానీ, పార్టీ ప్రమేయం కానీ లేవని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని ఖండించారు. దసపల్లా భూములకు రాణి కమలాదేవి యజమానిగా ఉన్నారని, గత ప్రభుత్వ హయాంలోనే సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని, అది అమలు చేయడం మినహా తమముందు వేరే గత్యంతరం లేదన్నారు. అమలు చేయని పక్షంలో కోర్టు ధిక్కారంగా పరిగణించి చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించినట్లు తెలిపారు.

విజయసాయిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధం లేదు
ఎస్యూర్ డెవలపర్స్ ఎల్ఎల్పీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ప్లాట్ల యజమానులు 64 మంది ఈ 15 ఎకరాల పరిధిలో ఉన్నారని వివరించారు. దసపల్లా భూములు సర్వే నెంబరు 1027, 1028, 1196, 1197 పరిధిలో 82 ఎకరాలు ఉన్నాయని, తనపై వస్తున్న ఆరోపణలన్నీ సత్యదూరమన్నారు. ఈ సందర్భంగా ఎస్యూర్ డెవలపర్స్ తో ఒప్పందం చేసుకున్న వేములపల్లి సందీప్, వేములపల్లి కోటేశ్వరరావు, మండల రాఘవేంద్రరావు, చల్లా వీరరాఘవులు, జాస్తి శరత్ బాబు, దాట్ల సుబ్బరాజు సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. వాణిజ్యపరమైన అంశాల ఆధారంగానే రాణి కమలాదేవి అధీనంలో ఉన్న దసపల్లా భూములపై ఒప్పందంచేసుకున్నామని తెలిపారు. దీనితో విజయసాయిరెడ్డికి, ఆయన కుటుంబ సభ్యులకు ఎటువంటి సంబంధం లేదన్నారు.

టీడీపీ న్యాయపోరాటం
దసపల్లా భూములపై న్యాయ పోరాటం చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈమేరకు విశాఖ లోక్సభ నియోజకవర్గ తెదేపా కమిటీ తీర్మానం చేసింది. టీడీపీ న్యాయ విభాగ అధ్యక్షుడు కె.వి.స్వామి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. దసపల్లా భూములను రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తన కుమార్తె, అల్లుడి పేరుమీద రిజిస్టర్ చేసిన సంస్థ ద్వారా ఒప్పందానికి అగ్రిమెంటు కుదుర్చుకొని వాటిని కొట్టేయబోతున్నారని టీడీపీ, జనసేన, సీపీఐ, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ పార్టీల నేతలంతా సంయుక్తంగా విశాఖలో నిరసనలు చేపడుతున్నారు.

బినామీల పేరుతో రిజిస్ట్రేషన్?
విజయసాయిరెడ్డి బినామీ కంపెనీల పేరుతో ఈ 15 ఎకరాలను రిజిస్ట్రేషన్ చేయించారని, వాటి ఛార్జీలకయ్యే డబ్బును తన కుమార్తె, అల్లుడి కంపెనీ నుంచి బినామీలకు పంపించారని, 22 ఏ కింద జాబితా నుంచి వాటిని స్వాధీనం చేసుకోబోతున్నారని ఈ పార్టీలన్నీ ఆరోపిస్తున్నాయి. డెవలప్ మెంట్ కు అగ్రిమెంటు కుదుర్చుకున్న కంపెనీ ''ఎస్యూర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ ఎల్ఎల్పీ'' విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి ఉమేష్, దుస్తుల వ్యాపారి గోపినాథ్రెడ్డిలకు చెందినదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ భూముల విలువ ప్రస్తుతం రూ.2వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.












Click it and Unblock the Notifications