జగన్ ఎటువైపు.. ఇప్పటికైనా నోరు విప్పుతారా..!
అధికార పార్టీ వ్యూహాలకు కోలుకోలేకపోతున్న వైసీపీకి.. ఇప్పుడు ఇంకో కొత్త ఇబ్బంది కూడా తోడయ్యింది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఇప్పటికే పార్టీ ఫిరాయింపులతో ఢీలా పడ్డ పార్టీకి, తాజాగా ఎమ్మార్పీఎస్ సెగ తగులుతోంది. ఎస్సీ వర్గీకరణ కోసం ఆందోళన బాట పట్టిన ఎమ్మార్పీఎస్ జగన్ ను ఇరకాటంలోకి నెడుతోంది. దీంతో ఇప్పటిదాకా ఎస్సీ వర్గీకరణపై ఒక్క మాట కూడా మాట్లాడిన జగన్ కు ముందు ముందు మరింత గడ్డుకాలమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రత్యేక హోదాపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిలదీసేందుకు కాకినాడలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే అదే సమయానికి అక్కడికి చేరుకున్న ఎమ్మార్సీఎస్ కార్యకర్తలు జగన్ వ్యవహారంపై నిరసన వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టే ప్రయత్నం చేశారు. దీంతో సభా ప్రాంగణంలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.
రంగంలోకి దిగిన వైసీపీ నేతలు ఎమ్మార్సీఎస్ కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. చివరికి వైసీపీ అభ్యర్థన మేరకు ఎమ్మార్సీఎస్ కార్యకర్తలు తమ ఆందోళన విరమించుకున్నారు. అయితే ఆ తర్వాత జరిగిన సభలో జగన్ ఎస్సీ వర్గీకరణ గురించి ఒక్క మాటైనా మాట్లాడకపోవడం ఎమ్మార్సీఎస్ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. దీంతో అప్పటిదాకా కాస్త శాంతించిన ఎమ్మార్సీఎస్ కార్యకర్తలు మళ్లీ జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్గారు.
ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లోను జగన్ సభలకు ఎమ్మార్సీఎస్ ఎఫెక్ట్ తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి ఇంతకాలం ఎస్సీ వర్గీకరణపై నోరు మెదపని జగన్ ఇప్పుడైనా తన వైఖరేంటో స్పష్టం చేస్తారో లేదో వేచి చూడాలి.