నాకు సిగ్గు, లజ్జ పోయాయి, బాలకృష్ణ కోసం కాళ్లు పట్టుకున్నావ్: బాబుకు ముద్రగడ
రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలని కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదివారం నాడు సవాల్ చేశారు.
ముద్రగడ పద్మనాభం కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు, ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కాపులకు రిజర్వేషన్లు కల్పించేందుకు తాము చిత్తశుద్ధితో ఉన్నామని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చెబుతోంది.

అదే సమయంలో ప్రత్యేక హోదా విషయమై కూడా ముద్రగడ.. చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం నాడు ఆయన ప్రత్యేక హోదా పైన మాట్లాడారు. చంద్రబాబుకు దమ్ముంటే హోదా కోసం నిరాహార దీక్ష చేయాలన్నారు.
తాను చేస్తున్న దీక్షలు దొంగ దీక్షలని చంద్రబాబు అనడాన్ని తప్పుబట్టారు. సమాజంలో వెనుకబడిపోయిన కాపుల భవిష్యత్తు బాగుండాలని తాను ఉద్యమాలు చేస్తుంటే వాటిని అణచి వేయాలన్న ఉద్దేశంతో కాపులతోనే తనను తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు.
హోదా కోసం చంద్రబాబు దీక్ష చేస్తే, తాను కూడా ఆ క్షణం నుంచి దీక్షను ప్రారంభిస్తానని, చంద్రబాబు పక్కనే కూర్చుంటానని చెప్పారు. అప్పుడు ఎవరు ఎక్కువ రోజులు దీక్ష చేయగలరో, ఎవరి సత్తా ఏంటో ప్రజలకు తెలుస్తుందన్నారు. అధికారంలో లేనప్పుడు చంద్రబాబు కూడా దీక్షలు చేశారన్నారు. అవి కూడా దొంగ దీక్షలేనా? అని ప్రశ్నించారు.
బాలకృష్ణ కోసం వైయస్ కాళ్లు పట్టుకున్నావ్
నాడు బావమరిది బాలకృష్ణ కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కాళ్లు పట్టుకొని వేడుకున్నావని ఆరోపించారు. మీ స్ఫూర్తి వల్లే కాపు ఉద్యమం పుట్టిందని, దీనికి మూలకారకులు మీరే అన్నారు.
మీ దయ వల్ల నాకు సిగ్గు, లజ్జ పూర్తిగా పోయాయన్నారు. మహా అయితే ఆఖరి అస్త్రంగా పోలీసుల చేత నా బట్టలు ఊడదీయించి బూటు కాళ్లతో తన్నిస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నన్ను ఏమైనా చేసుకోండి, కానీ మా జాతికి ఇచ్చిన హామీని అమలు చేయాల్సిందే అన్నారు.












Click it and Unblock the Notifications