ముద్రగడ ఆందోళన: కాపులంతా ఏకం, జగన్కు రివర్స్?
హైదరాబాద్: కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం ఆందోళనతో రాజకీయ ప్రయోజనం పొందాలని ఆశించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నిరాశే ఎదురు కానుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముద్రగడ దీక్ష విషయంలో తొలుత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు వేగంగా కదిలారు.
వైయస్ జగన్తో సహా పార్టీలోని కాపు నాయకులు బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అంబటి రాంబాబు ముద్రగడ ఆందోళనకు మద్దతు ఇస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా ధ్వజమెత్తుతూ వచ్చారు. ఈ పరిస్థితిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి అది ప్రయోజనం చేకూరుతుందని భావించారు.
రాజకీయ ప్రయోజనం కోసం జగన్ కులాల చిచ్చు పెడుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు, మంత్రులు ఆరోపించారు. కానీ, క్రమంగా ఇతర పార్టీలకు చెందిన కాపు నాయకులు కూడా ముద్రగడ దీక్షకు మద్దతు తెలపడం ప్రారంభించారు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు కనిపించిన కాంగ్రెసు నాయకుడు, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి కూడా రంగంలోకి దిగారు.

కాంగ్రెసు పార్టీలో ఉంటూ కేంద్ర మంత్రిగా పనిచేసిన దాసరి నారాయణ రావు కూడా ముద్రగడకు మద్దతు ఇస్తూ ఆయనను పరామర్శించడానికి కిర్లంపూడి బయలుదేరారు. కాంగ్రెసు నాయకులు రఘువీరా రెడ్డి, చిరంజీవి, దాసరి నారాయణ రావు వంటి నేతలు కిర్లంపూడికి బయలుదేరి, పోలీసుల నుంచి వ్యతిరేకత ఎదుర్కున్నారు. బిజెపిలోని కాపు నాయకులు కన్నా లక్ష్మినారాయణ, సోము వీర్రాజు కూడా ముద్రగడ పద్మనాభానికి మద్దతు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెనక పడిపోయింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు కాస్తా వెనకబడినట్లు కూడా కనిపిస్తున్నారు. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ కర్ర విరగకుండా పాము చావకుండా సేఫ్ గేమ్ ఆడుతున్నారు. మొత్తం ముద్రగడ దీక్ష వైయస్ జగన్కు ఉపయోగపడకుండా కాపు నేతల కార్యాచరణ పనికి వస్తోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications