గౌడకు మురళీ మోహన్ వినతి, చెట్లపై నారాయణ
న్యూఢిల్లీ/ విశాఖపట్నం: పాడైపోతున్న రాజమండ్రి రైల్వే వంతెనను సందర్శించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ రైల్వే మంత్రి సదానంద గౌడను కోరారు. హిధుద్ తుఫాను కారమంగా ఉత్తరాంధ్రలో రైల్వే ఆస్తులకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయన చెప్పారు. రైల్వే ఆస్తుల పునరుద్ధరణకు వెంటనే పనులు చేపట్టాలని తాను సదానంద గౌడను కోరినట్లు మురళీ మోహన్ మీడియాతో చెప్పారు.
హుధుద్ తుఫాను నష్టాన్ని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని విశాఖపట్నం పంపాల్సిందిగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కోరినట్లు ఆయన తెలిపారు. అలాగే విద్యుచ్ఛక్తి శాఖకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని చెబుతూ ఈ విషయంలోనూ సాయం చేయాలని తాను విద్యుచ్ఛత్కి శాఖ మంత్రి పియూష్ గోయల్ను కోరినట్లు మురళీ మోహన్ తెలిపారు.
హుధుద్ తుఫానుకు దెబ్బ తిన్న విశాఖపట్నం నగరంలో చెట్ల తొలగింపు ఇంకా పూర్తి కాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ చెప్పారు. మంచినీటి సరఫరాను పూర్తిగా పునరుద్ధరించారని, ప్రస్తుతానికి 25 శాతం అదనంగా కూడా నీళ్లు ఇస్తున్నారని ఆయన శనివారం మీడియాతో చెప్పారు.
రేపు ఆదివారం 50 శాతం అదనంగా నీరు ఇస్తారని, పరిశ్రమలకు కూడా మంచినీ నీరు ఇస్తున్నారని నారాయణ చెప్పారు. విశాఖపట్నంలో చెట్ల తొలగింపు ఇంకా పూర్తి కాలేదని, ప్రస్తుతం పది వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారని, మరో పది వేల మందిని రప్పిస్తామని ఆయన వివరించారు. రెండు రోజుల్లో అన్ని కాలనీల్లో పడిపోయిన చెట్లను తొలగిస్తామని ఆయన చెప్పారు.