దారుణం: ఒంటరిగా ఉన్న విద్యార్థినిపై కిరోసిన్పోసి నిప్పంటించారు
నల్గొండ: జిల్లాలోని సూర్యాపేట మండల పరిధిలోని కుసుమవారిగూడెం గ్రామంలో సోమవారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇంటర్ విద్యార్థినిపై గుర్తుతెలియని వ్యక్తులు కిరోసిన్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో 50 శాతానికిపైగా శరీరం కాలిపోవడంతో ఆమె ప్రాణపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు అందించిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలు చెరుకు రాములు-లక్ష్మి దంపతుల కుమార్తె చెరుకు ప్రవళిక సూర్యాపేటలోని భవిత జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. రోజు మాదిరిగానే గ్రామం నుండి కళాశాలకు బయలుదేరి వెళ్లింది. ప్రతిరోజు కళాశాల ముగిసిన తర్వాత సాయంత్రానికి ఇంటికి చేరుకునేది. అయితే సోమవారనం మాత్రం మధ్యాహ్నానికే ఇంటికి తిరిగి వచ్చింది.
ఆ తర్వాత కొంతసేపటికే ఆమె ఇంటిలోంచి పెద్ద కేకలు వినిపించడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకోగా అప్పటికే ప్రవళిక మంటల్లో కాలుతూ మంటలను ఆర్పుకునేందుకు యత్నిస్తోంది. చుట్టుపక్కలవారు ఆమెకు సహాయం అందించి, చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా కాలిన గాయాలతో ఉన్న ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు. దీంతో మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ తరలించారు.
కాగా, గాయాలతో ఉన్న ప్రవళిక.. తన ఇంట్లోకి గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల వయస్సు గల మహిళ వచ్చి ఇంట్లో ఉన్న కిరోసిన్ను తనపై పోసి నిప్పంటించినట్లు చెబుతోంది. ఒక్కరే దాడి చేశారా? ఇంకా ఎంతమంది ఉన్నారని ప్రశ్నిస్తే తనకు సరిగా గుర్తుకు రావడం లేదని సమాధానమిచ్చింది.
ప్రవళికపై కిరోసిన్పోసి నిప్పంటించింది ఎవరనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆమె కుటుంబానికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా, ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు చెప్పారు.