దోపిడీ దొంగల చేతిలో మృతి: అర్నెళ్ల క్రితమే నాగరాజు పెళ్లి
నల్లగొండ: సిమీ ఉగ్రవాదులు జకీర్, అస్లాం చేతిలో శనివారం ఉదయం నల్లగొండ జిల్లా జానకీపురం వద్ద జరిగిన కాల్పుల్లో మరణించిన నాగరాజుకు అరు నెలల క్రితమే వివాహమైంది. అతను నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందినవారు.
ఉగ్రవాదులు కాల్పులు జరుపుతున్న సమయంలో నాగరాజు వాహనం నడుపుతున్నాడు. ఆయన పక్కనే సిఐ బాలగంగిరెడ్డి కూర్చున్నారు. ఐదు కిలోమీటర్ల మేర వారు ఉగ్రవాదులను వెంబడించారు. మూలమలుపు వద్ద ఎడ్లబండి రావడాన్ని ఆసరాగా తీసుకుని ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నాగరాజు అక్కడికక్కడే మరణించాడు.
గాయపడిన బాలగంగిరెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎదురుకాల్పుల్లో గాయపడిన ఎస్సై సిద్ధయ్య తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
పోలీసుల కాల్పుల్లో మరణించిన ఉగ్రవాదులు జకీర్, అస్లాం ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. వారు కరీంనగర్ జిల్లా చొప్పదండిలో బ్యాంక్ను దోచుకోవడంతో పాటు మరో రెండు దోపిడీలకు పాల్పడినట్లు చెబుతున్నారు. వారి శవాలను సికింద్రాబాదులోని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

సూర్యాపేటలో కాల్పులకు పాల్పడింది వీరేనని డిజిపి అనురాగ్ శర్మ చెప్పారు. వారి వద్ద విజయవాడకు తీసుకున్న బస్సు టికెట్లు లభించాయని, దాంతో తాము ఆ నిర్ధారణకు వచ్చామని ఆయన అన్నారు. బుధవారం సాయంత్రం ఇద్దరు వ్యక్తులు హైదరాబాదులోని చాదర్ఘాట్ వద్ద బస్సు గుడివాడకు వెళ్తున్న బస్సు ఎక్కిన విషయం తెలిసిందే. వారు సూర్యాపేటలో తనిఖీలు నిర్వహిస్తుండగా తప్పించుకోవడానికి బస్సు దిగి, పోలీసులపైకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సూర్యాపేటలో ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు.
ఉగ్రవాదులతో సంబంధాలు లేవు
పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించిన ఇద్దరికి కూడా ఉగ్రవాదులతో సంబంధాలు లేవని తెలంగాణ హోం మంత్రి నాయని నర్సింహా రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేటలో కాల్పులు జరిపిన నిందితులు దర్గా దగ్గర ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని, ఆ సమయంలో వారు కాల్పులు జరిపారని, ఈ కాల్పుల్లో నాగరాజు మరణించాడని ఆయన వివరించారు.
దోపిడీ దొంగల చేతిలో మరణించిన నాగరాజు కుటుంబానికి 40 లక్షల రూపాయలు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. సూర్యాపేటలో ఎత్తుకెళ్లిన పోలీసుల ఆయుధం మృతుల వద్ద దొరికిందని ఆయన చెప్పారు. పోలీసులు అసమానమైన ధైర్య సాహసాలు ప్రదర్శించారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications