టిడిపిలోకి నల్లారి,వ్యతిరేకిస్తున్న అన్నయ్య
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దమైనట్టు ప్రచారం సాగుతోంది. ఆయన 2014 ఎన్నికల్లో పీలేరు అసెంబ్లీ స్థానం
చిత్తూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరేందుకు రంగం సిద్దమైనట్టు ప్రచారం సాగుతోంది. ఆయన 2014 ఎన్నికల్లో పీలేరు అసెంబ్లీ స్థానం నుండి జై సమైఖ్యాంధ్ర పార్టీ నుండి పోటీచేసి ఓటమిపాలయ్యారు.
గత మూడేళ్ళుగా నల్లారి సోదరులు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.అయితే బీజేపీ, కాంగ్రెస్, వైసీపీలలో చేరుతారనే పుకార్లు షికార్లు చేశాయి. ఏడాది కాలంగా ఏదో ఓ పార్టీలో చేరుతారని, నేడో రేపో ప్రకటన చేస్తారంటూ ఊహాగానాలు హల్ చల్ చేశాయి.
అయితే అదే సమయంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తల్లి అనారోగ్యంతో మరణించింది.ఈ తరుణంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమర్ నాథ్ రెడ్డి, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారి,జడ్పీ ఛైర్మెన్ గీర్వాణి చంద్రప్రకాష్ లు ఆదివారం సాయంత్రం నల్లారి కుటుంబసభ్యులను పరామర్శించారు.
అయితే చంద్రబాబునాయుడు సూచన మేరకు కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారనే ప్రచారం కూడ లేకపోలేదు.అయితే పార్టీలో చేరడానికి కిషోర్ కుమార్ రెడ్డి కూడ ఆసక్తిని ప్రదర్శిస్తున్నట్టు ప్రచారం సాగుతోంది.
అయితే కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ స్థానంతో పాటు టిటిడి ఛైర్మెన్ పదవిని ఇవ్వాలని కిషోర్ కుమార్ రెడ్డి అడుగుతున్నారని సమాచారం.అయితే రాజంపేట ఎంపి స్థానం ఇవ్వడానికి చంద్రబాబునాయుడు ఆసక్తిగా ఉన్నారు.అయితే అదే తరుణంలో టిడిపి ఛైర్మెన్ విషయంలో అంతగా ఆసక్తిని చూపడం లేదని సమాచారం. మరో వైపు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం కిషోర్ కుమార్ రెడ్డి టిడిపిలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నారని సమాచారం.